సుంకాలపై అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులను ఏర్పరుస్తోంది. భారత్పైనా అమెరికా సుంకం విధించింది. కొన్ని రంగాలలో ఇది భారత్కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ ‘డంపింగ్ గ్రౌండ్’గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంటే సుంకాల వల్ల నెలకొన్న ఉద్రిక్తతతో అమెరికా మార్కెట్లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురైన ఉత్పత్తులను చైనా భారత్కు తరలించవచ్చు. పెరుగుతున్న వాణిజ్య లోటు
భారత్, చైనా మధ్య వాణిజ్యలోటు పెరుగుతూ పోతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ సెల్స్, బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ సెల్స్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుంచి దిగుమతులు 11.5 శాతం పెరిగాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు 14.5 శాతం తగ్గాయి. ఇది భారత్ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడానికి దారితీసింది. ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా 99.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.46 లక్షల కోట్ల) కు చేరుకుంది.

ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చైనా వెతుకులాట?
అమెరికా విధించిన భారీ సుంకాలతో చైనా తన వస్తువులకు అమెరికా మార్కెట్ వెలుపల ఆల్టర్నేటివ్ మార్కెట్లను వెతుక్కోవచ్చు. అవసరమనుకుంటే భారత మార్కెట్కు తరలించవచ్చు. “ఎనిమిది ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తుల విభాగంలో భారత్కు చైనా అతిపెద్ద ఎగుమతిదారు. అన్ని ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు చైనా సప్లయ్ చైన్పై భారత్ ఆధారపడి ఉంది. భారత వాణిజ్య లోటు పెరగడానికి ఇదే కారణం” అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు. చైనాకు భారత ఎగుమతులు పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘డంపింగ్’ అంటే ఏమిటి?
ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు మార్కెట్లోకి పంపినప్పుడు, దానిని ‘డంపింగ్’ అంటారు. “చైనా ఉత్పత్తిదారులు ఈ పని చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. కచ్చితంగా డంపింగ్ భయం ఉంది” అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు. భారత మార్కెట్లోకి డంపింగ్ జరగకుండా అడ్డుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటీఆర్) అనే వ్యవస్థ ఉందని, డంపింగ్ జరిగితే పన్నులు విధించే అధికారం ఆ వ్యవస్థకు ఉందని ఆయన తెలిపారు. “చైనా ఉత్పత్తులకు అమెరికా పెద్ద వినియోగ కేంద్రం. సుంకాల పెంపుతో సహజంగానే ఈ మార్కెట్ తలుపులు చైనాకు మూసుకుపోతాయి.
భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఈ పరిస్థితులు భారత ఉత్పత్తిదారులకు కూడా ఒక అవకాశం కావచ్చు. అయితే ఇంకా అనేక ఆందోళనలు కూడా ఉన్నాయి. మార్కెట్ అనిశ్చితి, అమెరికా వ్యవహారశైలి వల్ల పెట్టుబడులు పెట్టే ముందు భారత ఉత్పత్తిదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా కంపెనీలు భారత్ను రవాణా స్థావరంగా ఉపయోగిస్తే, అమెరికాకు వస్తువులను పంపడానికి భారత మార్కెట్ను ఉపయోగిస్తే, ఓడరేవులు, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లకు స్వల్పకాలిక ప్రయోజనాలు కలగవచ్చు. అయితే ఇది అమెరికాకు కోపం తెప్పించే ప్రమాదమూ ఉంది.
Read Also: China: అమెరికాతో ఒప్పందాలు చేసుకునే దేశాలకు చైనా వార్నింగ్