రాష్ట్రపతి ఆమోదం తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం ద్వారా పారదర్శకతను నిర్ధరిస్తామని, వక్ఫ్ ఆస్తుల దోపిడీని నిలిపివేస్తామని, జవాబుదారీతనం వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఇలా ఒకే మతంలో సంస్కరణలను తీసుకురావడానికి ఎందుకు నిశ్చయించుకుందని ప్రతిపక్ష పార్టీలు, అనేక ముస్లిం సంస్థలు ప్రశ్నించాయి. దీనిని మైనారిటీ హక్కులలో జోక్యం చేసుకోవడంగా చూశాయి. ఇంతకీ, ఈ సవరణ నిజంగా సంస్కరణ చర్యనా లేదా ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడమా?, ఈ బిల్లు అవినీతిని అంతం చేస్తుందా లేదా మతపరమైన చర్చను తీవ్రతరం చేస్తుందా?.
2013లో 123 వీఐపీ ఆస్తులు వక్ఫ్కు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకీ ఈ కేసు ఏమిటి? వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం బిహార్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? యూపీఏ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్తో పాటు జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు రాజీవ్ రంజన్, రాజ్యాంగ నిపుణులు సంజయ్ హెగ్డే, సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి ఈ అంశాలపై చర్చలో పాల్గొన్నారు.

బిహార్ రాజకీయాలపై ప్రభావం?
ఈ ఏడాది చివర్లో బిహార్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ బిల్లు ఆ బిహార్ రాజకీయాలలో కీలకంగా మారనుంది. బిహార్లోని అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. అందుకే ఏ పార్టీ అయినా, అక్కడ ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంది. “బిహార్ ఎన్నికలు ముగిసే వరకు బీజేపీ ఎందుకు ఆగలేదో నాకర్థం కాలేదు” అని నీర్జా చౌదరి అంటున్నారు. అయితే “నితీష్ కుమార్కు కుర్మి, కోయెరి, మహాదళిత్, పస్మాండ ముస్లిం వంటి కొన్ని వర్గాలపై ఇంకా పట్టు ఉంది” అని నీర్జా చౌదరి అన్నారు.
జేడీయూ ఎందుకు మద్దతు ఇచ్చింది?
“ఈ బిల్లు గురించి చాలా అపోహలున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయి. ఇది చట్టంగా అమల్లోకి వచ్చినప్పుడు, అనేక రకాల అపోహలు వాటికవే పరిష్కారమవుతాయి. నితీశ్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారంటే, అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉండదని హామీ ఇచ్చినట్లే” అని జేడీయూ నేత రాజీవ్ రంజన్ అన్నారు. మతం కోణంలో బిల్లును చూడరాదని, రాష్ట్రంలోని హిందువుల కోసం బిహార్ మత బోర్డు కూడా ఏర్పడినట్లు ఆయన గుర్తుచేశారు.
వక్ఫ్ అంశంపై బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షాలు అండగా నిలిచాయి. కూటమిలో వ్యతిరేకంగా ఎటువంటి స్వరం వినిపించలేదు. “ఈ బిల్లుపై బీజేపీ తన మిత్ర పక్షాల మద్దతును తీసుకున్న తీరు, దాని రాజకీయ చతురతకు నిదర్శనం” అని నీర్జా చౌదరి అన్నారు. మిత్రపక్షాలు మద్దతు ఇవ్వకపోతే, బిల్లును ఆమోదించడం కష్టమయ్యేదని నీర్జా అభిప్రాయపడ్డారు.
ఎలా అమలుచేస్తారనే దానిపైనే..
గత ఏడాది ఆగస్టులో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్సభలో ప్రవేశపెడుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు దాని గురించి వివరించారు. “ఈ బిల్లు ఎవరి మత స్వేచ్ఛకు భంగం కలిగించదు. ఎవరి హక్కులను హరించడానికి కాదు. వక్ఫ్కు సంబంధించిన విషయాలలో హక్కులు పొందలేని వారికి వాటిని కల్పించడానికి తీసుకొచ్చా” అని రిజిజు అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ ఈ బిల్లులో మూడు ప్రధాన అభ్యంతరాలున్నాయన్నారు.