జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత అనూహ్య పరిణామలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులు పాకిస్తాన్లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టర్కీ ఇంటెలిజెన్స్ విభాగం, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెప్టినెంట్ జనరల్ యాసర్ కడియొగ్లు ఇస్లామాబాద్లో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ వైమానిక దళ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి భేటీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పాక్ వైమానిక దళం ఆధునికీకరణ, అత్యాధునిక ఆయుధాల సరఫరాకు తాము కట్టుబడి ఉన్నట్లు యాసర్ కడియొగ్లు పునరుద్ఘాటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శాటిలైట్ ప్రోగ్రామ్, ఇమేజినరీ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ వైమానిక కమాండర్లు, పైలెట్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇప్పించే దిశగా పరస్పర అంగీకారం కుదిరినట్లు సమాచారం.భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో టర్కీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ పాకిస్తాన్లో పర్యటించడం చర్చనీయాంశమౌతోంది.

ఏ క్షణమైనా భారత్ తమపై యుద్ధం చేయవచ్చు
ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది. వచ్చే 24-36 గంటల వ్యవధిలో ఏ క్షణమైనా భారత్ తమపై యుద్ధానికి దిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రకటించింది పాకిస్తాన్. పహల్గామ్లో 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను అడ్డుగా పెట్టుకుని భారత్ తమపై యుద్ధానికి దిగుతోందని, నిజానికి ఆ ఉగ్రవాద దాడితో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని బుకాయిస్తోంది.
ఉగ్రవాద దాడిలో తమ పాత్ర లేదు: పాక్
ఈ విషయంలో భారత్ చేస్తోన్న ప్రకటలన్నీ కూడా నిరాధారమని ఎదురుదాడికి దిగుతోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి తాము స్వయంగా బలి అవుతున్నామని, ఆ దాడులు మిగిల్చే క్షోభ ఎలాంటిదో తమకు బాగా తెలుసునని ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్. ఉగ్రవాదం విషయంలో భారత్.. తన విచారణ తానే జరుపుకొంటూ, తీర్పు ఇచ్చుకుంటూ, శిక్షను సైతం విధిస్తోందని పాకిస్తాన్ సమాచార ప్రసారాల శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఆరోపించారు.
పహల్గామ్ ఉగ్రవాదంపై విశ్వసనీయత, పారదర్శకంగా తటస్థ/ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించినప్పటికీ భారత్ దాన్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ ఇప్పటికే వివిధ దేశాలతో సంప్రదింపులు సైతం మొదలుపెట్టింది. పలు దేశాలను తమవైపు తప్పుకొనే ప్రయత్నాల్లో పడింది. చైనా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలతో మాట్లాడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తమ పాత్ర ఏదీ లేదంటూ చెప్పుకొంది. పహల్గామ్ దాడిని ఆదేశంగా తీసుకుని భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి దిగవచ్చని ఆ దేశం అభిప్రాయపడుతోంది. ఇందుకోసం తాము మిత్రదేశాలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ప్రకటించింది.
Read Also: Terrorist Attack : భారత్ కు పాక్ మాజీ ప్రధాని వార్నింగ్