అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో అమెరికన్లకు మాటిచ్చినట్లుగానే ప్రస్తుతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న ఇండియన్స్ ఏ మూలన దాగి ఉన్నా ఏరి ఏరి వెనక్కి పంపించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ భారతీయ అక్రమ వలసదారులను యుద్ధ విమానంలో తిరిగి వెనక్కి పంపించటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అమెరికాలో సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్న 18,000 మంది భారతీయులను తిప్పి పంపిస్తున్నారు. భారతీయులను తిరిగి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించినప్పటికీ ఇందుకు సరిపడా సమయం కూడా అందించకుండా ట్రంప్ తన పని తాను చేసుకుపోతున్నారు. అక్రమ వలసదారులను తిరిగి వెనక్కు పంపేందుకు అమెరికా తన సైన్యాన్ని, యుద్ధ విమానాలను ఉపయోగించటం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ట్రంప్ అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులను తరలించటానికి సీ-17 మిలిటరీ విమానాలను వాడుతున్నారు. ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వారి దేశాలకు డిపోర్టింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత ప్రధానీ మోదీ కూడా ఫోన్ కాల్ ద్వారా చర్చించారు. అయినప్పటికీ ట్రంప్ తన దూకుడు వైఖరితో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అమెరికా వాయుసేన విమానంలో బయలుదేరిన భారతీయ అక్రమవసలదారులతో కూడిన సీ-17 విమానం 24 గంటల్లో ఇండియాకు చేరుకుంటుందని రాయిటర్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ చర్యలతో ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న దాదాపు 7.25 లక్షల మంది వలసదారులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 2.5 శాతం మంది అక్రమ వలసదారులను తిప్పి ఇండియాకు పంపుతున్నారు. ప్రస్తుతం డిపోర్టేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాలు తాము కూడా టార్గెట్ అవుతామేమో అనే ఆందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.