టెక్(Tech) రంగంలో మరోవిడత లేఆఫ్స్(Layoffs)కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఉద్యోగులపై మరో విడత వేటు వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్స్(Microsoft, Google, Amazon) వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 130కంపెనీల్లో 61వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు నెలకొన్నాయి.
కృత్రిమ మేథ ప్రాబల్యం
ఆదాయం వృద్ధిలో తగ్గుదల, స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మేథ ప్రాబల్యం పెరగటం వంటి కారణాలు ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. లే ఆఫ్స్ డేటా అధ్యయన సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 130 సంస్థలు ఈ ఏడాది ఇప్పటివరకు 61వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. అందులో మైక్రోసాఫ్ట్కు చెందిన 6వేల మంది ఉద్యోగులు ఉన్నట్లు తేలింది. 2023 తర్వాత ఇంతపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటిసారి అని పేర్కొంది.

వాషింగ్టన్లోనే 2వేల మంది ఉద్యోగులపై వేటు
ఒక్క వాషింగ్టన్లోనే 2వేల మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు సమాచారం. కృత్రిమ మేథ వినియోగాన్ని పెంచేదిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్లు చోటుచేసుకున్నాయి. అయితే వేటుపడిన వారిలో ఏఐ వ్యవస్థను రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వ్యాపారనిర్వహణను క్రమబద్ధీకరించటం, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కంటే ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ అప్పుడు 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు
గూగుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2023లో పునర్నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టిన గూగుల్ అప్పుడు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది కూడా కోతలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఆరంభంలో గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో 200మందిని ఇంటికి పంపింది. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా గతంలో పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్లలో ప్రకటించిన లేఆఫ్స్ మాదిరిగా ఇప్పుడు తొలగింపులు చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నఉద్యోగుల సంఖ్యలో 5శాతం కోత
అమెజాన్ కూడా పరికరాలు, సేవల విభాగంలోని వందమంది ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ సంస్థల జాబితాలో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రయిక్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నఉద్యోగుల సంఖ్యలో 5శాతం కోతపెట్టింది. దీర్ఘకాలిక లాభాల పెంపుతోపాటు వర్తమాన మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కోతలు అమలు చేసినట్లు క్రౌడ్ స్ట్రయిక్ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపుల విషయంలో ఐబీఎం వ్యూహం భిన్నంగా ఉంది. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే వందలాది మందిని తొలగించిన ఈ టెక్ దిగ్గజం కృత్రిమమేథ ద్వారా ఆదా అయిన మొత్తాలతో ప్రోగ్రామింగ్, సేల్స్ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టింది. గతంలో వందలమంది చేసే పనిని కృత్రిమ మేథతో భర్తీ చేసినట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు.
Read Also: Trump: హార్వర్డ్ విషయంలో ట్రంప్ కు కోర్డు బిగ్ షాక్