Minister Sridhar Babu : కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణ ను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కు హబ్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామన్నారు.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్
అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోతున్న ఏఐ యూనివర్సిటీ గురించి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యమయ్యేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
పరిశ్రమల ఏర్పాటును ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయలేదని వరంగల్, కరీంనగర్ లాంటి ఇతర నగరాలకు విస్తరించేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. టెక్నాలజీ, స్కిల్ డెవలెప్ మెంట్, ఇతర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Read Also: నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం