వంగర పోలీసుల వినూత్న ప్రయత్నం – సైకిళ్లపై పెట్రోలింగ్ చేస్తూ ప్రజలకు ఆప్తం
పోలీసులు అనగానే కొన్ని ఊహాగానాలు మనసులో మెదులుతాయి – కఠినంగా వ్యవహరించే అధికారులు, భయముతో పలకరించాల్సిన వ్యక్తులు. కానీ హనుమకొండ జిల్లా వంగర పోలీసుల (Police) కథ మాత్రం అందుకు భిన్నం. వారు ప్రజల మధ్యకే వచ్చి, సైకిళ్లపై ఊరంతా చక్కర్లు కొడుతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. ఇది వారి విధుల పట్ల నిబద్ధతకే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చూపించే ఉదాహరణ కూడా.
ఉదయం 8 అయ్యిందంటే చాలు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసులు ఠాణా నుంచి సైకిళ్లపై బయలుదేరుతారు. ఇదిగో ఇలా ఊరంతా చుట్టేస్తారు. మధ్యాహ్నం వరకూ ఇదే విధంగా సైకిళ్లపైనే పెట్రోలింగ్ చేయడం వీరి రోజూ వారి దినచర్యలో భాగమైపోయింది మరి. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజల్లో పోలీసుల(Police) పై మరింత నమ్మకం కలిగించేందుకు సైకిల్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

సైకిళ్లపై పట్రోలింగ్ – బాధ్యతగా, భద్రతగా
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వంగర, రత్నగిరి, మాణిక్యాపూర్, రాంనగర్, గాంధీనగర్, రంగయ్యపల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామస్తుల యోగక్షేమాలు, సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా వంగర ఎస్ఐ దివ్య సొంత ఖర్చుతో నాలుగు సైకిళ్లను కొనుగోలు చేసి సిబ్బందితో కలిసి రోజూ సైకిళ్లపై గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో మమేకమవుతున్నారు. యువతలో డ్రగ్స్, మత్తుపదార్థాల వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నారు. చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచనలిస్తున్నారు.
తదేకాక, విద్య ప్రాముఖ్యత గురించి గ్రామీణ యువతకు వివరించడమే కాక, హెల్మెట్ వినియోగం లేనిదే వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను చక్కగా వివరించి, వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇలా ప్రతి ఇంటికి చేరుకొని మాట్లాడే ఈ విధానం పోలీసుల పట్ల ఉన్న నెగెటివిటీని తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ప్రజల అభినందనలు – ముఖ్యమంత్రిపైనా ప్రశంసలు
వంగర పోలీసుల ప్రయత్నాన్ని గ్రామస్తులు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. “ఇంత దగ్గరగా వచ్చి మన సమస్యలు అడిగిన పోలీసులని ఇంతకుముందెప్పుడూ చూసినట్లు లేదు,” అని ఆనందంగా చెబుతున్నారు. నిజంగా గడప వద్దకే పోలీసు వస్తే భయం కాదు, భరోసా కలుగుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడింది.
ఈ సైకిల్ పెట్రోలింగ్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. వంగర పోలీసుల ఈ వినూత్న ఆచరణను ట్విటర్ ద్వారా ప్రశంసిస్తూ, ఇది రాష్ట్రవ్యాప్తంగా మిగతా పోలీస్ స్టేషన్లకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
సైకిల్ పెట్రోలింగ్ – ఒక మార్గదర్శక మోడల్
“పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న నేగెటివిటీని తీసేయడానికి కమ్యూనిటీ పోలీసులో భాగంగా సైకిల్ పెట్రోలింగ్ అనేది ఎంచుకున్నాం. దీనివల్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ జనాలకు నేరుగా కనిపించడంతో వారికి సైబర్ నేరగాళ్లు, డ్రగ్స్ నుంచి రక్షణ కల్పిస్తున్నాం. యువతను పక్కదారి పట్టకుండా చూస్తున్నాం. యువతకు ఒక స్నేహపూర్వక వాతావరణం కల్పించడం ద్వారా వారు దురాలవాట్ల నుంచి దూరం అవుతారని అనుకుంటున్నాం. అందుకే సైకిల్పై పోలీస్ పెట్రోలింగ్ను ప్రారంభించాం.” – దివ్య, వంగర ఎస్సై
Read also: CM Revanth: కాలేశ్వరం విచారణ కీలక మలుపులతో మంత్రులతో సీఎం రేవంత్ భేటీ