రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్(IPL) విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి కర్ణాటక(Karnataka) ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు(High Court) గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ప్రభుత్వ తీరుపై ఆరా తీసింది.
తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా
అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నామని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. “మేము మా అభిప్రాయాలను అడ్వకేట్ జనరల్కు తెలియజేశాం. ఆయన దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ను రికార్డులోకి తీసుకున్నాం. ఈ సుమోటో కేసును రిట్ పిటిషన్గా నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 10వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది.

రూ.10 లక్షల చొప్పున పరిహారం
చిన్నస్వామి స్టేడియం వద్ద వేలాది మంది అభిమానులు గుమికూడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని ప్రభుత్వం ఊహించలేకపోయిందని ఆయన అన్నారు.
“హృదయ విదారకం”: నరేంద్ర మోదీ
ఈ విషాద ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటన “హృదయ విదారకం” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు, జేడీ(ఎస్), బీజేపీ నేతలు మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపిస్తూ, బాధ్యుల రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also: http://RCB :తొక్కిసలాట మృతులకు ఆర్థిక సాయం.. ఆర్సీబీ