బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ‘సికందర్’ చిత్రం అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రంజాన్ కానుకగా విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, విడుదలైన తొలి రోజునుంచే మిశ్రమ స్పందన రావడంతో, సినిమా ఆశించిన రీతిలో ఆడటం లేదన్న అసంతృప్తి అభిమానుల్లో వ్యక్తమైంది.

సల్మాన్ ఖాన్ కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ వస్తుందని ఆశించిన అభిమానులకు ‘సికందర్’ నిరాశనే మిగిల్చింది. సినిమా కథ, స్క్రీన్ప్లే, విజువల్ ప్రెజెంటేషన్ ఇలా అన్నింటిపై మిశ్రమ స్పందన రావడంతో, సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు నిర్మాత సాజిద్ నదియావాలా కారణంగానే సినిమా ఆశించిన స్థాయికి వెళ్లలేదని ఆరోపిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కెరీర్ను నాశనం చేస్తున్న వ్యక్తి సాజిద్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
సాజిద్ నదియావాలా సతీమణి రియాక్షన్
ఈ విమర్శలపై సాజిద్ నదియావాలా సతీమణి వార్దా ఖాన్ స్పందించారు. అభిమానులు సోషల్ మీడియాలో సాజిద్పై తీవ్రస్థాయిలో పోస్ట్లు పెడుతుండగా, ఆమె వాటిని రీపోస్ట్ చేస్తూ తీవ్రంగా స్పందించారు. ఆమె చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్లు వైరల్ అవుతుండగా, ఓ నెటిజన్ విమర్శలను రీపోస్ట్ చేస్తూ తిడుతుండటంపై మీకు ఏమాత్రం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించాడు. దీనికి వార్దా ఖాన్ మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ సూటిగా సమాధానమిచ్చారు. ఈ విమర్శలపై సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే, ఆయన మేనేజర్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు, సల్మాన్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా, తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా కలెక్షన్లు కూడా ఊహించిన స్థాయికి రావడం లేదు.