ఇంటి స్థలాన్ని రిజిస్టర్ చేయాలంటే ఖర్చు భరించాల్సిందేనని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి వార్త ఉంది.వచ్చే వారం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తానే స్వయంగా వెల్లడించారు.ఆయన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నాలుగో రోజు మంగళగిరిలో మాట్లాడారు.మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద నిర్వహించిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించారు.ఇదేరోజు మొత్తం 1030 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, గతంలో పట్టాల కోసం ప్రజలు ఎంతగా సతమతమయ్యారో గుర్తు చేశారు.

ఒకప్పుడు చెప్పులరిగేలా తిరిగారు, ఎవ్వరూ పట్టించుకోలేదు
పట్టాల కోసం ప్రజలు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో జిరాక్స్ తీసుకోవడానికే వేల రూపాయలు ఖర్చయ్యేవని, అర్జీలు పెట్టుకోవడానికే తలబొప్పి అయ్యేదని గుర్తు చేశారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, తాము ప్రభుత్వం ఏర్పరిచిన తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేశామన్నారు.వచ్చే వారం నుంచి మీ ఇంటి స్థలాన్ని ప్రభుత్వ స్థాయిలో నమోదు చేసుకోవచ్చు. అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా.ఇది సామాన్యుడికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. అంతే కాకుండా, రెండు సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని అమ్ముకునే హక్కు కూడా వారికి లభిస్తుంది.అయితే ఒక సూచన మాత్రం చేశారు – “దయచేసి ఇప్పుడే అమ్మకూడదు, మన ప్రాంత అభివృద్ధిని ముందే చూడండి” అని చెప్పారు.మంగళగిరి ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడిన లోకేశ్, ఇది దేశంలో నెంబర్ వన్ టౌన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “మీ అందరి సహకారంతో మంగళగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీ కోసం నానా పాట్లూ పడతాను” అంటూ హామీ ఇచ్చారు.