నేడు తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభ

Pawan Varahi public meeting in Tirupati today

అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ నిర్వహించే వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే సభలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పవన్ ప్రకటించే డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ కల్యాణ్ ఏమి సందేశం ఇస్తారు అనేది దానిపై అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. తిరుపతి క్షేత్రంగా జరుగుతున్న ఈ వారాహి బహిరంగ సభకు రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హజరవుతారని భావిస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ మూడు రోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతి లడ్డూ అంశంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కల్యాణ్ .. నిన్న శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు.