హిందీ భాషపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్న వేళ, పవన్ కళ్యాణ్ హిందీ భాషను వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి.తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యంగా డీఎంకే నేతలు కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం (నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ)2020 ప్రకారం హిందీని ఎవరికీ బలవంతంగా నేర్పించడంలేదని స్పష్టం చేసింది. విద్యార్థులకు వారి ఇష్టానుసారం భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని కేంద్రం చెబుతోంది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
శుక్రవారం పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషను వ్యతిరేకించడంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమే అంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలకు కౌంటర్గా డీఎంకే పార్టీ నేతలు కూడా స్పందించారు. తాము హిందీని ద్వేషించడం లేదని, తమపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామంటూ పేర్కొన్నారు.

సోషల్ మీడియా
పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాష వివాదం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం, రెండూ మన భారతదేశ జాతీయ, సాంస్కృతిక ఏకీకరణను సాధించడంలో ఉపయోగపడవు. నేను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదు. దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే నేను వ్యతిరేకించాను.(నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ) 2020లో హిందీని తప్పనిసరి చేయలేదు, దానిపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.ఎన్ఈపి 2020 ప్రకారం, విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలను (వారి మాతృభాషతో సహా) నేర్చుకునే వెసులుబాటు ఉంది.హిందీ వద్దనుకుంటే, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలి, మెయిటీ, నేపాలీ, సంతాలి, ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చు. బహుళ భాషా విధానం విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడానికి, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి దీన్ని రూపొందించారు.