తల్లిఒడిలో అల్లారుముద్దుగా పెరగాల్సిన ముక్కుపచ్చలారని పసికందులను.. అక్రమ రవాణాకు అలవాటు పడ్డ రాబందులు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్నాయి. చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో ఇతర రాష్ట్రాల లింకులు బయటపడుతున్నాయి. ఇటీవల వెలుగుచూసిన ఉదంతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు చిన్నారులను విక్రయిస్తున్న కేసులో పోలీసులు 11 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు నిందితులు.. గతేడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో 16 మంది చిన్నారులను విక్రయించిన కేసులో పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు తాజాగా వెలుగుచూసింది.
గుజరాత్ నుంచి హైదరాబాద్ కు చిన్నారుల అమ్మకం
రాజధానిలోని కొత్తపేటకు చెందిన గృహిణి బట్టు దీప్తి(35), గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ విధానంలో వార్డు బాయ్ గా పనిచేస్తున్న బూడిది సంపత్కుమార్(40) ఇద్దరూ గతేడాది మేడిపల్లిలో నమోదైన కేసులో అనుమానితులుగా ఉన్నారు. ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో పోలీసులు అప్పట్లో వీరి గురించి ఆరా తీసినా.. సరైన ఆధారాలు లభించక వదిలేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు రూటు మార్చుకున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి చిన్నారులను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి అమ్మేయడంలో వీరు దళారులుగా వ్యవహరిస్తూ దాదాపు 9 నెలల తర్వాత చైతన్యపురి పోలీసులకు చిక్కారు. మరోవైపు ఏపీలోని విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు బలగం సరోజ(21) నేతృత్వం వహిస్తోంది. ఈమె గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ కేసులోనూ అరెస్టయి జైలుకెళ్లింది. బయటకొచ్చాక మళ్లీ చిన్నారుల అక్రమ రవాణా దందా మొదలు పెట్టి తాజాగా విజయవాడ పోలీసులకు చిక్కింది.
తల్లిదండ్రులు జాగ్రత్త
హైదరాబాద్, విజయవాడకు చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన నేరగాళ్లతో కలిసి వీరు గొలుసుకట్టు విధానంలో చిన్నారులను విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా దిల్లీ, గుజరాత్ నుంచే చిన్నారులను తీసుకొస్తున్నారు. ఏపీ, తెలంగాణ కేంద్రంగా ఉన్న ముఠాలు పిల్లలు లేని దంపతులను గుర్తిస్తున్నారు. సమాచారం ఇస్తే ఇతర రాష్ట్రాల్లోని ముఠాలు ఏజెంట్ల ద్వారా చిన్నారులను నగరానికి పంపిస్తున్నారు. మేడిపల్లి కేసులో దిల్లీ నుంచి పిల్లలను పంపించడంలో ప్రీతికిరణ్ అనే యువతి పేరు అప్పట్లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈమె ఆచూకీ కోసం ప్రయత్నించినా చిక్కలేదు. ఇటీవల చైతన్యపురి కేసులో గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి పిల్లలను తీసుకొస్తున్నట్లు గుర్తించారు. విజయవాడ కేసులోనూ అహ్మదాబాద్కు చెందిన అనిల్, దిల్లీకి చెందిన ప్రీతికిరణ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రీతికిరణ్ మూలాలు, చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటీ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులంతా వ్యవస్థీకృతంగా వేర్వేరు మార్గాల్లో పసికందులను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న కేటుగాళ్లు
Read Time:
1 min
Tags:
#telugu News
Ap News in Telugu
Breaking News in Telugu
Google News in Telugu
Latest News in Telugu
Paper Telugu News
Scammers who are
Telugu News online
Telugu News Paper
Telugu News Today
Today news
trafficking children
రచయిత గురించి
Vanipushpa
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.