దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ సమక్షానికి వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్- వాటి మిత్రపక్షాలు విప్ సైతం జారీ చేశాయి. టీడీపీ కూడా విప్ ఇచ్చింది. ఈ బిల్లుకు జనసేన మద్దతు తెలిపింది. వక్ఫ్ బిల్లు గతంలో పార్లమెంట్ సమక్షానికి వచ్చినప్పటికీ- అది ఆమోదం పొందలేదు. అందులో సవరణలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జగదంబికా పాల్ దీనికి సారథ్యాన్ని వహించారు.

284 మందితో చర్చలు జరిపారు
ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది. ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది.
వక్ఫ్ బిల్లుపై ఎలాంటి అపోహలు వద్దు: కిరణ్
దీనిపై తాజాగా కిరణ్ రిజిజు మాట్లాడారు. వక్ఫ్ బిల్లుపై ఎలాంటి అపోహలు అక్కర్లేదని అన్నారు. కొంతమంది మత పెద్దలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు.. ఈ బిల్లుపై అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. గతంలో సీఏఏపై ముస్లింలకు ఎలాంటి భయాందోళనలను కలిగించారో.. ఇప్పుడు కూడా అలాంటి చర్యలకే పాల్పడుతున్నారని అన్నారు. సీఏఏ వల్ల ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ముప్పు రాలేదని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని హామీ ఇచ్చారు.