బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురు వర్షపాతం నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత ఇంకో మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నైలోని భారత వాతావరణ ప్రాంతీయ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

లోతట్టు ప్రాంతాలు జలమయం
శుక్రవారం నాడు వర్షాల తీవ్రత నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, నాగపట్టణం, కరైకల్ జిల్లాల్లో అత్యధికంగా కనిపించింది. కొన్ని గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫర స్తంభించింది. జనం అంధకారంలో గడిపారు. కన్యాకుమారి జిల్లాలోని కోజిపోర్విలైలో 19 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. తిరుప్పూర్ నార్త్లో 11, కోయంబత్తూర్ జిల్లాలోని నంబియూర్, సుళ్లూర్లల్లో ఎనిమిది సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఈరోడ్, రామనాథపురం, మండపం, థొండి, పాంబన్లల్లో 7 నుంచి అయిదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు
థేని, తెన్కాశి, రామనాథపురం, కన్యకుమారిల్లో ఈ సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెన్నై ఆర్ఎండీ వెల్లడించింది. తిరునెల్వేలి, తూత్తుకూడి, విరుధునగర్, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, మధురై జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. ఈ తాజా వర్షాల వల్ల తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.
READ ALSO: నేడు పిడుగులతో కూడిన వర్షాల