ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) అంటే ప్రకృతి పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించడానికి ఒక రోజును ప్రత్యేకంగా నిర్దేశించి ప్రపంచ దేశాలన్ని (World Countries) ఒక్క చోట చేరుతాయి. ఈ సందర్భంగా ప్రకృతి(Nature)కి హాని చేసే చర్యల గురించి, వాటి కారణంగా జరుగుతున్న నష్ట నివారణ చర్యలు గురించి చర్చలు జరుపుతారు. ప్రతి ఏడాది జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధముంది.
స్వార్థం కోసం ప్రకృతి నాశనం
ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధముంది. అది ఎంత దగ్గర సంబంధమంటే మనిషి ప్రకృతిలో పుడతాడు. ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరకు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు.
ఈ వినాశానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవ వినాశనానికి గురైన పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.

తగు చర్యలు జాగ్రత్తలు చేపట్టాలి
తొలిసారిగా 1972 లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సు లో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. స్వీడన్ వేదికగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1973 నుంచి జూన్ 5న ప్రతియేటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పర్యావరణానికి హాని ఉండదు
ప్రతి సంవత్సరం జూన్ 5 రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి మాట్లాడుకుంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనగానే ప్రకృతి ప్రేమికులకు మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. నిత్యం ప్రకృతితో మమేకమై ఉండే ప్రతి ఒక్కరికీ ఈ రోజు పండుగలానే ఉంటుంది. ఒక్కసారిగా బాల్య స్మృతులు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో మొక్కలు నాటడం, ప్రతిరోజూ నాటిన మొక్కలకు నీళ్లు పోయడం, తిరిగి స్కూల్ విడిచి పెట్టి వెళ్లే సమయంలో మొక్కలను విడిచి పెట్టలేక బాధ పడటం ఇవన్నీ మర్చిపోలేని మధుర స్మృతులు. అలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని, ఓ మంచి పని చేసిన ఫీల్ పొందుతాం. ఆ ఫీల్ మనలో ఎప్పటికీ ఉంటుంది.
జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరిస్తారు. విద్యార్ధులచేత మొక్కలు నటించడం, ప్లాస్టిక్ రహిత సమాజ ఆవశ్యకతను వివరించడం చేస్తారు.
తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి
ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు సమావేశాలు చర్చలు జరిపి, తీర్మానాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. ఆ తీర్మానాలు ఆచారంలో పెట్టడంలో అందరూ విఫలం అవుతున్నారు.
భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే! ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రక రకాల కాలుష్యాలను సముద్రంలోకి పంపిస్తున్నాయి. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వే ప్రకారం చివరకు ఎవరెస్టు శిఖరం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. పర్వతారోహకులు ఆహారపదార్ధాలు ఉంచిన ప్లాస్టిక్ కంటైనర్లు తమతో తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో ఈ అనర్థం జరుగుతోంది.
మట్టి అన్నదే కనుమరుగై పోయింది
నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగై పోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు.
Read Also: Sharmistha Panoly: శర్మిష్ట కేసులో న్యాయమూర్తికి బెదిరింపులు