‘ఎవరెస్ట్ మ్యాన్’(Everest Man)గా పేరున్న నేపాలీ షెర్పా కమీ రీటా(Kami Rita).. 31వ సారి ఎవరెస్ట్(Everest) శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కువ సార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డును తానే బద్దలుకొట్టారు. ఈ పర్వతం ఎక్కేందుకు భారత సైనిక అధికారుల బృందానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన 55 ఏళ్ల షెర్పా (గైడ్) కమీ రీటా.. మంగళవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 4.00 గంటలకు 8,849 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ”షెర్పా కమీ రీటా(Sherpa Kami Rita)ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన నేషనల్ క్లైంబింగ్ హీరో (జాతీయ పర్వతారోహక హీరో) మాత్రమే కాదు, ఎవరెస్ట్కే ప్రపంచ చిహ్నంగా మారారు’‘ అని ఈ పర్వత యాత్రను నిర్వహించిన ‘సెవెన్ సమిట్ ట్రెక్స్’ తన ప్రకటనలో తెలిపింది.

తొలిసారి గా 1994లో ఎవరెస్ట్ను అధిరోహించారు
వాణిజ్య యాత్రకు మార్గదర్శిగా 1994లో తొలిసారి కమీ రీటా ఎవరెస్ట్ను అధిరోహించారు. అప్పటి నుంచి ఏటా ఆయన ఈ పర్వతాన్ని ఎక్కుతున్నారు. 2023, 2024 ఏళ్లలో రెండేసి సార్లు ఈ శిఖరాన్ని ఎక్కారు. ఎవరెస్ట్ ఎక్కడంలో కమీ రికార్డును అధిగమించేందుకు మరో నేపాలీ షెర్పా పసంగ్ దావా కూడా పోటీలో ఉన్నారు. ఆయన 29 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. గత వారం కూడా ఆయన ఎవరెస్ట్ను ఎక్కేందుకు ప్రయత్నించారు.
తన పర్వతరోహణలు కేవలం పని కోసమేనని కమీ రీటా గతంలో మీడియాకు చెప్పారు.
”ఈ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది” అని గత ఏడాది మే నెలలో ఏఎఫ్పీకి తెలిపారు.
ప్రపంచంలో నేపాల్కు గుర్తింపు
”ప్రపంచంలో నేపాల్కు గుర్తింపు తెచ్చిపెట్టడంలో నా పర్వతారోహణలు సాయపడటం చాలా సంతోషాన్ని ఇస్తుంది” అని కమీ రీటా అన్నారు. ఎవరెస్ట్పై జీవితం ఎలా ఉంటుందో చెప్తూ.. కమీ రీటా గత నెలలో ఒక పోస్ట్ చేశారు. అందులో ఎవరెస్ట్ యాత్రలకు ప్రారంభానికి ముందు ఈ యాత్ర సురక్షితంగా, విజయవంతంగా సాగాలని ప్రార్థిస్తూ నిర్వహించే టిబెట్ బుద్ధుడి పూజ కార్యక్రమం కూడా ఉంది. బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్ 19వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఒక వారంలోనే కమీ రీటా ఈ ఘనతను సాధించారు.
షెర్పా కాని వారిలో అత్యధికసార్లు ఈ శిఖరాన్ని ఎక్కింది కెంటన్ కూల్.
ప్రస్తుత పర్వతారోహణ సీజన్లో ఇప్పటివరకు 500 మందికి పైగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు.
పర్యావరణంపై ప్రభావం
ఈ సీజన్లో 1000కి పైగా క్లైంబింగ్లకు నేపాల్ అనుమతులు జారీ చేసింది. దానిలో ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఉన్నట్లు నేపాల్ పర్యటక విభాగం వివరాల్లో ఉంది. ఇటీవల కాలంలో ఎవరెస్ట్ను అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల జనం తాకిడి, పర్యావరణ ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే పర్వతారోహకులు ఇకపై తమ మలాన్ని తిరిగి బేస్ క్యాంప్కి తీసుకొచ్చి, పారవేయాలని గత ఏడాదినే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Miss World: ఆదివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్స్..ఘనంగా ఏర్పాట్లు