జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 27 మంది కన్నుమూశారు. పలువురు పర్యాటకులు, స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే భారీగా సైన్యం సంఘటన స్థలానికి తరలి వెళ్లింది. ఆర్టికల్ 370 రద్దయిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి ఉదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉలిక్కిపడేలా చేసింది. తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.

టాక్సీ డ్రైవర్లు కొవ్వొత్తుల ప్రదర్శన
పహల్గామ్ దాడికి నిరసనగా అక్కడి టాక్సీ డ్రైవర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా ఈ నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు కొనసాగాయి. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, అఖ్నూర్, కుప్వారాల్లో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూలో బజరంగ్దళ్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి భద్రత బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పహల్గామ్ బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని పర్యాటక ప్రదేశాలు, ఇతర సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దేశ రాజధాని సైతం అప్రమత్తం అయింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన కారణం
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ హేట్ స్పీచ్ కారణం అనే అభిప్రాయాలు తాజాగా వ్యక్తమౌతోన్నాయి. ఈ దాడికి కొన్ని రోజుల ముందు.. అసిమ్ మునీర్ ద్వేషపూరిత ప్రసంగం చేశారు. హిందువులు, జమ్మూ కాశ్మీర్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ఇటీవలే ఓ పాకిస్తానీ డయాస్పోరాను ఉద్దేశించి అసీమ్ మునీర్ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లో తరచూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా భావిస్తోన్నారు.
ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం
ఇందులో విధ్వేషపూరక ప్రసంగం చేశారాయన. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్పై తమ వైఖరి ఎప్పటికీ మారబోదని, ఆ ప్రాంతం పాకిస్తాన్ ప్రాణవాయువు అని అభివర్ణించారు. కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందంటూ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా ఎందరో పాకిస్తానీయులు సాహసోపేత పోరాటం చేశారని, తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. తాము ఎప్పటికైనా కాశ్మీరీ సోదరులను ఆదుకుంటామని పేర్కొన్నారు. దీని తరువాతే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వయానా ఆర్మీ చీఫ్ విధ్వేషపూరకంగా ప్రసంగించడం, రెచ్చగొట్టడం వల్లే ఈ రక్తపాతం సంభవించిందనే వాదనలు వినిపిస్తోన్నాయి. ఈ మారణహోమానికి టీఆర్ఎఫ్ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.