పాకిస్తాన్(Pakistan)కు చెందిన 17 ఏళ్ల టిక్టాకర్ సనా యూసుఫ్(Sana Yusuf) హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇస్లామాబాద్(Islamabad) పోలీసులు తెలిపారు. ఇస్లామాబాద్లోని ఆమె ఇంట్లో సనా యూసుఫ్ సోమవారం హత్యకు గురైంది. నిందితుడిని ఫైసలాబాద్లో అరెస్ట్ చేశామని, సనా మొబైల్ ఫోన్ను కూడా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఇస్లామాబాద్ ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) సయ్యద్ అలీ నాసిర్ రిజ్వీ మీడియాకు తెలిపారు.
ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, “నిందితుడు సనాను ఇష్టపడుతున్నాడని, ఆమెతో స్నేహం చేయాలనుకుంటున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కానీ సనాకు ఇది నచ్చలేదు. నిందితుడి ప్రపోజల్ను చాలాసార్లు తిరస్కరించింది. అయినా చాలా రోజులుగా ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడు” అని అన్నారు. జూన్ 2వ తేదీ సోమవారం నాడు నిందితుడు సనా ఇంటి దగ్గరికి వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నిస్తుండగా.. సనా నిరాకరించడంతో..ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారు?
సీసీటీవీ, కాల్ రికార్డులను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారని రిజ్వి తెలిపారు.
“నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అనేక చోట్ల సోదా చేశారు. ఈ సమయంలో, 113 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను శోధించారు. సుమారు 300 ఫోన్ కాల్స్, సోషల్ మీడియా కార్యకలాపాలు పరిశీలించి, 37 మంది అనుమానితులను షార్ట్లిస్ట్ చేశాం” అని రిజ్వి అన్నారు.
కాల్ డేటాను డిలీట్ చేయడానికి నిందితుడు సనా ఫోన్ను తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు పదవతరగతి చదివాడని, ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అని కూడా పోలీసులు వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడుతూ, సనా యూసుఫ్ ఫోన్ రికార్డుల దర్యాప్తులో ఆమెకు, నిందితుడికి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు తేలిందని చెప్పారు. “సనా ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆమె కుటుంబం చెప్పింది. సనా కాల్ రికార్డులను తనిఖీ చేసినప్పుడు, ఒక నంబర్ ప్రొఫైల్లోని ఫోటో వారి వివరణతో సరిపోలింది” అని ఆయన చెప్పారు.

పోలీసులను ప్రశంసిస్తూ పాకిస్తాన్ హోంమంత్రి
అనుమానితుడిని అరెస్టు చేసినందుకు పోలీసులను ప్రశంసిస్తూ పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. “నిందితుడి నుంచి పోలీసులు ఒక తుపాకీతోపాటు సనా మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు” అని ఆయన ఆ పోస్ట్లో రాశారు. “సోమవారం, ఒక వ్యక్తి అకస్మాత్తుగా మా ఇంట్లోకి ప్రవేశించి మా కుమార్తె సనా యూసుఫ్పై కాల్పులు జరిపాడు, రెండు బుల్లెట్లు ఆమె ఛాతీలోకి దూసుకెళ్లాయి” అని ఫిర్యాదులో పేర్కొన్నారు సనా పేరెంట్స్.
” కాల్చిన తర్వాత, గుర్తు తెలియని వ్యక్తి మెట్లు దిగి పరిగెత్తాడు. మేం అలారం మోగించగానే, చుట్టూ జనం గుమిగూడారు. నేను నా కూతురిని పొరుగువారి కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లాను. కానీ అప్పటికే ఆమె చనిపోయింది” అని సనా తల్లి ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
సంఘటన జరిగిన సమయంలో తన భర్త, అంటే సనా తండ్రి ఇంట్లో లేరని.. తాను, తన బావమరిది, సనా మాత్రమే ఇంట్లో ఉన్నారని సనా తల్లి పోలీసులకు తెలిపారు.
గత నెలలో కూడా పంజాబ్లోని ఖుషాబ్ జిల్లాలో టిక్టాకర్ ఇక్రా ఆజం హత్యకు గురైంది. ఆ కేసులో ఆమె బంధువులలోనే ఒకరు నిందితుడు.
సనా ఎవరు?
సనా యూసుఫ్ వయసు 17 ఏళ్లు. ఆమె ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ జిల్లాకు చెందిన యువతి ఆమె. ఆమె కుటుంబం కొంతకాలంగా ఇస్లామాబాద్లో నివసిస్తోంది. టిక్టాక్ ఖాతాలో ఆమెకు దాదాపు 81 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. సనా తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటున్న వీడియోను సోమవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆమె తన వీడియోలలో.. ఇస్లామాబాద్లోని వివిధ ప్రదేశాల గురించి, అక్కడి ఫుడ్ గురించి చెప్పేవారు. సనా కుటుంబ సభ్యులు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అని చెప్పారు.
మహిళలు, బాలికలు హత్యకు గురవుతున్నారు
“ధైర్యంతో, నమ్మకంతో, సంతోషంగా ఉన్నందుకు మహిళలు, బాలికలు హత్యకు గురవుతున్నారు” అని హక్కుల కార్యకర్త నిదా కిర్మాణి రాశారు. ‘‘17 ఏళ్ల సనా యూసుఫ్ జీవితం ఇలా అర్థంతరంగా ముగియాల్సింది కాదు. ఆమెకు న్యాయం జరగాలి. ఈ సంఘటనకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి” అని జర్నలిస్ట్ ఎహ్తిషాముల్ హక్ రాశారు.
Read Also: Terrorist: కుక్క చావు చచ్చిన జైషే మహ్మద్ కీలక ఉగ్రవాది