రష్యా ఉక్రెయిన్(Russia-Ukraine)ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా శనివారం రాత్రి రష్యా అతిపెద్ద దాడి చేసింది. రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్(Ukrain)పై విరుచుకుపడింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు.
గత రాత్రి అతిపెద్ద దాడి
ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ మాట్లాడుతూ.. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు చెప్పారు. పోలాండ్(Poland) గగనతల రక్షణ కోసం మిత్రదేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఖెర్సాన్ ప్రావిన్స్లో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయి.. అందులోని పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మిలిటరీ తెలిపింది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో మూడు ఎఫ్-16లను రష్యా కూల్చివేసింది.

నేటికీ మాస్కోలో పేలుళ్లు జరుగుతున్నాయి: పుతిన్
రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. బెలారస్ రాజధాని మిన్స్క్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘రష్యాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ పనిచేస్తున్నంత కాలం ఎవరూ దానిపై దృష్టి సారించరు. మాస్కోలో పేలుళ్లు నేటికీ జరుగుతున్నాయి. మా దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి, మాపై పోరాటానికి ఉగ్రవాదాన్ని సాధనంగా ఎంచుకున్న పశ్చిమదేశాల విషయంలో కూడా ఇదే జరిగింది. నాటో విస్తరణ, ఉక్రెయిన్తో వివాదాన్ని పరిష్కరించడం లాంటి వాగ్దానాలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోకుండా పశ్చిమ దేశాలు రష్యాను పదేపదే మోసం చేస్తున్నాయి’’ అని పుతిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్న రష్యా
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద యుద్దం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. తొలి రోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం.
Read Also: mining accident : సుడాన్ లో కుప్పకూలిన బంగారు గని… 11 మంది మృతి