రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్(Ukraine)పై పుతిన్(Putin) సైన్యం భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నేను లేకుండా ఉంటే ఇప్పటికే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది. చాలా నష్టపోయింది. ఈ విషయాన్ని పుతిన్ గ్రహించడం లేదు. ఆయన నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు’ అని తమ సామాజిక మాధ్యమ వేదిక ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఇలాగే పుతిన్ తీవ్రంగా మండిపడ్డారు. పుతిన్కు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా చాలా మందిని చంపుతున్నారని అన్నారు.

పుతిన్ ఉత్తర్వులు జారీ
అమెరికా ఆధ్వర్యంలో కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు రష్యా తన ఆక్రమణల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను రష్యా ఆక్రమించిందని స్థానిక అధికారి పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి ఎవరికీ చెందని ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల పుతిన్ ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది రోజులకే ఈ చర్యలు చేపట్టింది. అయితే రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలు ఇటీవల తుర్కియేలో సమావేశమై ఖైదీల మార్పిడికి అంగీకారం కుదుర్చుకున్నాయి. తత్ఫలితంగా వందల మంది యుద్ధ ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి. ఇదిలా ఉండగా, గత శుక్రవారం నుంచి ఆదివారం మధ్యకాలంలో ఉక్రెయిన్పై రష్యా 900 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పర్యవసానంగానా అన్నట్టు రష్యా సోమ, మంగళవారాల్లో 60 డ్రోన్లు మాత్రమే ప్రయోగించింది.
ఖైదీల శవాలే సాక్ష్యాలు..
యుద్ధ ఖైదీలుగా నిర్బంధించిన ఉక్రెయిన్ సైనికుల పట్ల రష్యా అమానుషంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన మూడేళ్లలో రష్యా చెరలో 200 మందికి పైగా యుద్ధఖైదీలు మరణించరని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. రష్యా కిరాతకంగా వ్యవహరిస్తోందనడానికి ఖైదీల శవాలే సాక్ష్యాలని తెలిపారు. సైనికుల శవాలు బాగా కుళ్లిపోయిన స్థితికి చేరాకే అప్పగిస్తున్నారని, అమానుష చర్యల్ని తెలియజేసే ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారని అధికారులు తెలిపారు.