ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించడమే ఈ సంఘర్షణకు అత్యంత ప్రభావవంతమైన ముగింపు అని ఆయన అన్నారు. ఖొమైనీని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్(Israel) ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వీటో చేశారని అమెరికా అధికారులు ధృవీకరించిన మరుసటి రోజే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య క్షిపణి దాడులు నాలుగో రోజుకు చేరాయి. ఇరు దేశాలు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి.

ఖొమైనీని హతమార్చడం వల్ల వివాదం ముగిసిపోతుందని, మరింత తీవ్రతరం కాదని గట్టిగా విశ్వసిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. ఇరాన్ దుందుడుకు చర్యలను నిరోధించడానికి, దుష్ట శక్తులను ఎదుర్కోవడానికే ఇజ్రాయెల్ ఈ చర్యలు తీసుకుంటోందని ఆయన నొక్కిచెప్పారు.
“ఘర్షణ ముగింపు అదే!” – నెతన్యాహు వ్యాఖ్యలు
అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఖొమైనీని చంపేందుకు ఇజ్రాయెల్ వేసిన ప్రణాళికను ట్రంప్ వీటో చేశారన్న వార్తలపై నెతన్యాహు స్పందించారు. “ఇది సంఘర్షణను పెంచదు, ముగిస్తుంది” అని ఆయన అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మరింత తీవ్రమవుతుందన్న ఆందోళనతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలు వస్తున్నాయి. అమెరికా అధికారి లీకుల ద్వారా బహిర్గతమైంది. ఇది సంఘర్షణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లొచ్చన్న భయంతో ట్రంప్ ఈ దశలో వెనక్కి తగ్గారని వార్తలు చెబుతున్నాయి.
పౌర ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి
“ఇరాన్ కోరుకునేది ‘శాశ్వత యుద్ధం’, వారు మమ్మల్ని అణుయుద్ధం అంచుకు తీసుకువస్తున్నారు” అని నెతన్యాహు పేర్కొన్నారు. “వాస్తవానికి, ఇజ్రాయెల్ చేస్తున్నది దీనిని నివారించడమే. ఈ దురాక్రమణకు ముగింపు పలకడమే. దుష్ట శక్తులను ఎదుర్కోవడం ద్వారానే మనం ఇది చేయగలం” అని ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలోనే తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా శాంతి దూతలు, దేశాలు ఇరు దేశాలను నియంత్రించేందుకు
ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్రిక్తత తగ్గడం లేదు.
Read Also: Gaza : ఇజ్రాయెల్ దాడి – 45 మంది పాలస్తీనియన్లు మృతి