పాకిస్థాన్ నేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో(Bilawal Bhutto) అమెరికా(America) పర్యటనలో శాంతి గురించి మాట్లాడటంపై బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య(Tejaswi Surya) తీవ్రంగా స్పందించారు. బిలావల్ నోటి నుండి శాంతి వచనాలు వినస్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
తేజస్వీ సూర్య మాట్లాడుతూ..
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ నేతృత్వంలోని భారత అఖిలపక్ష బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్వీ సూర్య మాట్లాడుతూ, “భుట్టో తనను తాను శాంతి ప్రతినిధిగా అభివర్ణించుకుంటున్నారు. అంతేకాకుండా, శాంతి గురించి మాట్లాడుతున్నారు. ఇది చూడటానికి దెయ్యాలు వేదాలు చదివినట్లుగా ఉంది” అని ఎద్దేవా చేశారు.

చౌకబారు ఆయుధాలతో పాకిస్థాన్ కాలం
పాకిస్థాన్ నకిలీ హీరోలను తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని, యుద్ధంలో విఫలమైన వారికి ఫీల్డ్ మార్షల్స్గా పదోన్నతులు ఇస్తోందని ఆయన ఆరోపించారు. “వారికి అసలైన హీరోలు ఎలా ఉంటారో తెలియదు. చైనాకు చెందిన చౌకబారు ఆయుధాలతో పాకిస్థాన్ కాలం గడుపుతోంది. కాబట్టి, మా దేశంలోని అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మా బలగాలను, మా బలమైన ప్రజాస్వామ్య నాయకత్వాన్ని వారు జీర్ణించుకోవడం కష్టమే” అని తేజస్వీ సూర్య అన్నారు.
బిలావల్ భుట్టో ఏమన్నారంటే…
ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలోనే పాకిస్థాన్ కూడా తన మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సారథ్యంలో ఓ ఎంపీల బృందాన్ని అమెరికాకు పంపింది. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో బిలావల్ భుట్టో ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్లకు చెందిన నిఘా సంస్థలు పరస్పరం సహకరించుకుంటే ఉగ్రవాద ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అణ్వస్త్ర దేశాలైన భారత్-పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యుద్ధం మళ్లీ తలెత్తే అవకాశాలు పెరిగాయే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు.
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారత్ నదీ జలాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని బిలావల్ ఆరోపించారు.
Read Also: Odisha: కోరాపుట్ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి ఆరుగురు మృతి