జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ చర్య ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్నవారికి గట్టి హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో భారత పర్యాటకులపై లష్కరే తోయిబాకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన క్రూరమైన దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు సహా మొత్తం 26 మంది మరణించారని మిశ్రీ గుర్తుచేశారు.

అత్యంత పాశవికంగా హత్య
ముంబై 26/11 దాడుల తర్వాత పౌరులు ఇంత పెద్ద సంఖ్యలో మరణించిన ఉగ్రదాడి ఇదేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను అతి సమీపం నుంచి వారి కుటుంబ సభ్యుల ముందే తలలపై కాల్చి అత్యంత పాశవికంగా హత్య చేశారని, ఈ దాడి జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులను దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగిందని తెలిపారు. గత ఏడాది 2.25 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించారని, పర్యాటకాన్ని దెబ్బతీసి, ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్ర ఇందులో ఉందని అన్నారు.
ఈ దాడికి “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” (టీఆర్ఎఫ్) అనే సంస్థ బాధ్యత తీసుకుందని, ఇది ఐక్యరాజ్యసమితి నిషేధించిన లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని మిశ్రీ తెలిపారు.
Read Also: Operation Sindoor On Pakistan: భారత యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించుకున్న పాకిస్తాన్