ఇరాన్ బుధవారం(జూన్ 18) తన అత్యంత శక్తిమంతమైన ఆయుధమైన హైపర్సోనిక్ ఫతా క్షిపణితో ఇజ్రాయెల్పై దాడి చేసినట్టు తెలిపింది. ఇజ్రాయెల్(Israe;) రాజధాని టెల్ అవీవ్ వైపు క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)(IRGC) పేర్కొంది.
ఫతా-1 క్షిపణులను ప్రయోగించినట్టు ఐఆర్జీసీ చెప్పిందని ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ మెహర్, రాష్ట్ర చానల్ ప్రెస్ టీవీ కూడా తెలిపాయి. ‘ఆపరేషన్లో తాజా దశ కీలకమైనదిగా ఐఆర్జీసీ వర్ణించింది. ఫతా క్షిపణుల మోహరింపు, ఇజ్రాయెల్ వర్చువల్ రక్షణ వ్యవస్థల అంతానికి ఆరంభమని ఐఆర్జీసీ(IRGC) చెప్పింది’ అని ప్రెస్ టీవీ తెలిపింది. అంతకు ముందు జూన్ 13న ప్రారంభమైన ఘర్షణలో ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే, టెల్ అవీవ్, హాయిఫాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. గత ఏడాది అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు, పదుల సంఖ్యలో ఫతా-1 క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. ప్రస్తుత ఘర్షణల్లో ఈ క్షిపణిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఫతా క్షిపణిని 2023లో తయారుచేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(Khamenei) పేరును దీనికి పెట్టారు.

అల్ ఫతా – సెకనుకు 5 కిలోమీటర్లు
హైపర్ సోనిక్ ఆయుధాలంటే సాధారణంగా ధ్వని వేగం కంటే 5 నుంచి 25 రెట్లు వేగం ఉన్న ఆయుధాలని అర్ధం. ఇరాన్ మొదట ఫతా క్షిపణిని బాలిస్టిక్, క్రూయిజ్ శ్రేణుల్లో హైపర్ సోనిక్ క్షిపణిగా ప్రవేశపెట్టింది. ‘అల్-ఫతా'(Al-Phata) హైపర్సోనిక్ క్షిపణి 1400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. అన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని, వాటిని నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉందని ఐఆర్జీసీ తెలిపింది. లక్ష్యాన్ని ఛేదించే ముందు ‘అల్-ఫతా’ 13 నుంచి 15 ‘మాక్’ వేగంతో ప్రయాణిస్తుంది. మాక్15 అంటే సెకనుకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించే వేగం.
అల్-ఫతా బాలిస్టిక్ క్షిపణి ఆవిష్కరణ
అల్-ఫతా బాలిస్టిక్ క్షిపణి ఆవిష్కరణ తర్వాత, తెహ్రాన్లోని ‘పాలస్తీనా స్క్వేర్’లో ‘400 సెకన్లలో టెల్ అవీవ్’ అని రాసిన పోస్టర్ను ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఉంచారు. “మా శత్రువులు తాము డెవలప్ చేసిన ఆయుధాల గురించి గొప్పలు చెప్పుకోవడం నేను విన్నాను. భూమిపైనైనా, గాలిలోనైనా, సముద్రంలోనైనా, ఏ టెక్నాలజీకైనా మా దగ్గర సమాధానం ఉంది” అని ఇరాన్ వాదనలు, హైపర్సోనిక్ క్షిపణుల మోహరింపుపై ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అప్పట్లో అన్నారు.
అల్-ఫతా 1 , అల్-ఫతా 2
అల్-ఫతా 1 ని ఆవిష్కరించిన నాలుగు నెలల తర్వాత, 1500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగిన కొత్త తరం క్రూయిజ్ క్షిపణి ‘అల్-ఫతా 2’ను రివల్యూషనరీ గార్డ్స్ ఆవిష్కరించింది. ‘అల్-ఫతా 2’ చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుందని, ప్రయాణంలో అనేకసార్లు దాని మార్గాన్ని మార్చుకోగలదని ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఐఆర్జీసీ-అనుబంధ అషురా యూనివర్శిటీ ఆఫ్ ఏరోస్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని సందర్శించినప్పుడు ‘అల్-ఫతా 2’ క్రూయిజ్ క్షిపణిని ఆవిష్కరించారు. అయితే క్షిపణి పరిధి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఫతా క్షిపణిని ఇరాన్ ప్రవేశపెట్టినప్పటికీ, ఏప్రిల్ 13నగానీ, ఆ తర్వాత అక్టోబర్ 1న జరిగిన దాడులలోగానీ ఈ క్షిపణులను ఉపయోగించలేదు.
నాలుగు రకాల ఇరానియన్ క్షిపణులు
ఇరాన్ క్షిపణి కార్యక్రమాలపై దర్యాప్తును గత ఏడాది అక్టోబర్ 7న, బీబీసీ ప్రచురించింది.
ఇరాన్ తయారు చేసిన ఈ నాలుగు రకాల క్షిపణులలో ప్రాథమికంగా ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి సముద్రానికి లక్ష్యాలను ఛేదించేవి ఉన్నాయి.
అయితే, ఇరాన్ ఆయుధగారంలో రక్షణ వ్యవస్థ క్షిపణులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని రష్యా, చైనాలు తయారు చేసినవి. కొన్నింటిని ఇరాన్ సాయుధ దళాలు అభివృద్ధి చేశాయి. వాటి గురించి ప్రస్తావించలేదు. 2024 ఏప్రిల్లో ఇజ్రాయెల్పై జరిగిన క్షిపణి దాడిలో ఇరాన్ ‘ఇమాద్ త్రీ’ బాలిస్టిక్ క్షిపణులు, ‘పావే’ క్రూయిజ్ క్షిపణులు, ‘షాహిద్ 136’ డ్రోన్లను ఉపయోగించింది.
అయితే ‘ఖైబర్ షికాన్’ బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగించిందని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. ఇమాద్ బాలిస్టిక్ క్షిపణి మధ్యస్థ-శ్రేణి ఆయుధం. ఇది 1700 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని చెబుతారు.
‘పావే’ క్షిపణులకు గ్రూప్గా దాడి చేయగల సామర్థ్యం
‘పావా’ అనేది 1650 కిలోమీటర్ల పరిధి కలిగిన మధ్యస్థ-శ్రేణి క్రూయిజ్ క్షిపణుల సిరీస్లో భాగం. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయాణించగల తరహా క్షిపణులలో ఇది మొదటిది. ‘పావే’ క్షిపణులకు గ్రూప్గా దాడి చేయగల సామర్థ్యం ఉంది. దాడి సమయంలో ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోగలవు. బహుశా అందుకే ఇజ్రాయెల్పై దాడి చేయడానికి దీనిని ఎంచుకున్నారు. ‘పావే’ క్షిపణి గురించి ఫిబ్రవరి 2023లో ప్రపంచానికి తెలియజేసింది ఇరాన్. ఈ క్షిపణికి ఇజ్రాయెల్ను చేరుకోగల సామర్థ్యం ఉందని తెలిపింది. ఇరాన్ చెప్పింది నిజమేనని ఏప్రిల్ 13న జరిగిన దాడిలో నిరూపితమైంది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం 2000 నుంచి 2500 కిలోమీటర్ల ప్రభావవంతమైన పరిధి కలిగిన క్షిపణులు ఉన్నాయి. ఇవే ఆ దేశం దగ్గరున్న అత్యున్నత ఆయుధాలు.