పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బుధవారం రాత్రి భేటీ కానున్న నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా పాక్ గగనతలం, వైమానిక స్థావరాల వినియోగం జరగదని ఆశిస్తున్నామని భారత్(India)లోని ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ మహ్మద్ జవాద్ హుసేనీ(Mohammad Javad Hosseini) పేర్కొన్నారు. భారత్లోని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఆయన బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. “ట్రంప్తో ఆసిమ్ మునీర్ భేటీ కాబోతున్నారు. పాక్ గగనతలం, ఎయిర్ బేస్లను ఇరాన్కు వ్యతిరేకంగా వినియోగిస్తారేమో” అని జవాద్ హుసేనీని వార్తాసంస్థ ప్రతినిధి ప్రశ్నించగ, “పాకిస్థాన్ను అమెరికా వినియోగించుకోలేదని నేను ఆశిస్తున్నాను” అని బదులిచ్చారు.

ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేయాలని కోరుతున్నాము
“ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలోకి అమెరికా అడుగుపెట్టదని మేం ఆశిస్తున్నాం. పశ్చిమాసియాలోని ఏ ఒక్క దేశానికో ప్రయోజనం చేకూర్చేలా అమెరికా చర్యలు ఉండకూడదు అనేదే మా వాదన” అని జవాద్ వ్యాఖ్యానించారు. “మేం ఎన్నడూ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడనే లేదు. ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేయాలని మాత్రమే అంతర్జాతీయ సమాజాన్ని కోరాం. దానివల్ల ఏ ఒక్క దేశానికో ప్రయోజనం దక్కదు” అని ఆయన తెలిపారు. “అమెరికా ఓవైపు మాతో చర్చలు జరిపింది. ఇంకోవైపు ఇజ్రాయెల్తో మా దేశంపై దాడులు చేయించింది. అందుకే చర్చల నుంచి తప్పుకున్నాం” అని మహ్మద్ జవాద్ హుసేనీ వెల్లడించారు.
ఆర్టికల్ 51 ప్రకారం మాకు ఆత్మరక్షణ హక్కు ఉంది
“ఐక్యరాజ్యసమితి ఛార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం మాకు ఆత్మరక్షణ హక్కు ఉంది. ఇతర దేశాలు చెప్పేది మేం వినం. ఇప్పుడు యుద్ధం ఆపాలని, కొనసాగించాలని, స్వీయ రక్షణ చేసుకోవాలని ఎవరెవరో ఏదేదో చెబితే మేం వినేది లేదు. ఏం చేయాలో మాకు తెలుసు” అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో కీలకమైన ఇరాన్ సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని మహ్మద్ జవాద్ హుసేనీ గుర్తుచేశారు. ఇజ్రాయెల్ చర్యలన్నీ ఐరాస నిబంధనలకు వ్యతిరేకమన్నారు. “అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మాపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. మేం మా ప్రజలు, ప్రభుత్వం, దేశాన్ని కాపాడుకునే స్థితిలో ఉన్నాం. ఈవిషయాన్ని ఇప్పటికే నిరూపించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం ప్రతిఘటించక తప్పదు. ఇజ్రాయెల్ దాడులకు జవాబు ఇవ్వక తప్పదు” అని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్పై భీకర దాడులు : ఇరాన్ సైన్యం
ఇజ్రాయెల్పై భీకర దాడులు చేయబోతున్నామని పేర్కొంటూ ఇరాన్ సాయుధ దళాల చీఫ్ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్పై తాము చేసిన దాడులన్నీ హెచ్చరికల లాంటివని, ఇకపై తీవ్రంగా దెబ్బతీసే రీతిలో దాడులు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈమేరకు వివరాలతో ‘ఐఆర్ఎన్ఏ’ వార్తాసంస్థ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇరాన్తో ఒకవైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు ఇజ్రాయెల్ చేతికి దాడులు చేయించడం వల్లే చర్చల నుండి వెనక్కి తగ్గామని జవాద్ పేర్కొన్నారు. “మధ్యవర్తిత్వం గురించి మేము మాట్లాడలేదు. కానీ ఇజ్రాయెల్ దూకుడుపై అంతర్జాతీయ సమాజం కళ్లెం వేసే బాధ్యత వహించాలి” అని అన్నారు.
ఇరాన్ భవితవ్యంపై 48 గంటల్లో పూర్తి క్లారిటీ వస్తుంది: ట్రంప్
ఇరాన్ విషయంలో ఏం చేయాలనే దానిపై రాబోయే 48 గంటల్లో పూర్తి క్లారిటీ వస్తుందని మంగళవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరగాలా? తగ్గాలా? అనేది దానిపై స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకైతే ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ ఏ మాత్రం తగ్గలేదని ఆయన కామెంట్ చేశారు. “ముగింపు- నిజమైన ముగింపు- కాల్పుల విరమణ మాత్రం కాదు. ముగింపో, లేదంటే పూర్తిగా అణు చర్చలను ఆపేయడమో- చూడాలి మరి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Read Also: Donald Trump : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ భేటీ..