జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని తీవ్రంగా ఖండించిన భారత్, తాజాగా దిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్కు బుధవారం అర్ధరాత్రి తర్వాత సమన్లు పంపింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా (అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే) అధికారిక నోటీసు అందించింది. దీని ప్రకారం వారు రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుందని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్
మరోవైపు, పహల్గాంలో నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్ను గట్టిగా భారత్ హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.
సీసీఎస్ తీసుకున్న నిర్ణయాలు
సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత. ఇరుదేశల మధ్యనున్న అటారీ సరిహద్దు మూసివేత. భారత్, పాకిస్థాన్లలోని ఇరుదేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులకు అనుమతుల రద్దు. మే ఒకటో తేదీలోగా దేశం వీడి వెళ్లిపోవాలని ఆదేశం. ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను చట్టం ముందు నిలిపి వారికి అండగా నిలిచిన సూత్రధారులను ఆ నేరానికి బాధ్యత వహించేలా చేయడం.
అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన
పాకిస్థాన్ సరిహద్దుల వెంట అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన.
భారత్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం. దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధింపు. ఈ నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తకు భారత్ తాజాగా సమన్లు పంపింది. భారత విదేశాంగ శాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న సాద్ అహ్మద్ వరైచ్ను పర్సోనా నాన్ గ్రాటా (PNG)గా ప్రకటించింది. దీని ప్రకారం, ఆయనకు భారత్ విడిచిపోవడానికి 7 రోజులు గడువు ఇచ్చింది. ఇది పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ సైనిక శిబిరాల నుంచి మద్దతు అందుతున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు