అనిల్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో కనిపిస్తున్న ఈ వ్యాపారవేత్త అందరికంటే ముందుగానే అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించినప్పటికీ వాటిని సవ్యంగా నిర్వహించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన వ్యాపారాలు తిరిగి చాలా కాలం తర్వాత ప్రస్తుతం ఒకదాని తర్వాత మరొకటి కోలుకుంటున్నాయి. వ్యాపార ప్రపంచంలో భూస్థాపితం అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం తిరిగి సోదరుడు ముఖేష్ అంత స్థాయిలో కాకపోయినా మంచి బౌన్స్ బ్యాకర్ గా నిరూపించుకుంటున్నారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్
ఇక వివరాల్లోకి వెళితే అనిల్ అంబానీ కంపెనీకి ఫిబ్రవరి 26, 2025 చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ కొనుగోలుదారుడిని కంపెనీ ప్రస్తుతం కనుగొంది. రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేయాలన్న ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్(IIHL) అభ్యర్థనకు ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 26 నాటికి రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేయడానికి మార్గం సుగమమైంది. పరిష్కార ప్రణాళిక అమలుకు సంబంధించి అన్ని పత్రాలను అందించటంతో పాటు ఆర్థిక ముగింపు సాధించడాన్ని IIHL ధృవీకరించింది.
రూ.4,300 కోట్లను డ్రాకు సిద్ధం
ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 26కి వాయిదా పడింది. ఆమోదించబడిన పరిష్కార ప్రణాళిక తుది ముగింపుకి అనుగుణంగా రిలయన్స్ క్యాపిటల్ దాని అనుబంధ సంస్థల నియంత్రణను IIHLకి అప్పగించడం గురించి ఆ రోజు చర్చించబడుతుంది. రిలయన్స్ క్యాపిటల్ నిర్వాహకుడు మంగళవారం పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు, ఫైనాన్సింగ్ కోసం పత్రాలను అమలు చేసి, లక్ష్యిత ముగింపు తేదీ నాటికి నిధులను ఉపసంహరించుకోవడం ప్రారంభించనున్నట్లు వర్గాలు తెలిపాయి. క్రమంలో రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ రుణదాతలకు రిజల్యూషన్ ప్లాన్ విలువలో రూ.9,861 కోట్ల చెల్లింపును పూర్తి చేయడానికి అవసరమైన రూ.4,300 కోట్లను డ్రా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హిందూజా గ్రూప్ రుణదాతలకు హామీ ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.