పోప్ ఫ్రాన్సిస్ 2013లో కాథలిక్ చర్చికి పెద్ద అయ్యారు. ఆయన అర్జెంటీనా దేశం నుంచి వచ్చిన మొదటి పోప్, చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన వచ్చినప్పటి నుండి, వాటికన్ (ఇది కాథలిక్ చర్చికి ప్రపంచ ప్రధాన కేంద్రం) పని చేసే తీరులో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. శతాబ్దాలుగా వస్తున్న కొన్ని పద్ధతులను మార్చి, చర్చిని సామాన్య ప్రజలకు మరింత దగ్గరగా, పేదలకు అండగా ఉండేలా, మరియు చేసే పనుల్లో మరింత నిజాయితీగా ఉండేలా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యం.
ఆర్థిక సంస్కరణలు: వాటికన్ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, దాని నిర్వహణలో గతంలో కొన్నిసార్లు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ముఖ్యంగా “వాటికన్ బ్యాంక్” గురించి చాలా విమర్శలు ఉండేవి. పోప్ ఫ్రాన్సిస్ వచ్చాక, ఈ డబ్బు వ్యవహారాల్లో మరింత పారదర్శకత (అంటే అంతా బహిరంగంగా,దాపరికాలు లేకుండా) ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
బ్యాంకులో సరిగా లేని ఖాతాలను మూసివేయించారు. డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ నుండి వస్తోంది అనే దానిపై నిఘా పెట్టడానికి “సెక్రటేరియట్ ఫర్ ది ఎకానమీ” అనే ఒక కొత్త ఆఫీసును (మన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ లాంటిది) ఏర్పాటు చేశారు.

వాటికన్ ఆఫీసుల పనితీరులో మార్పు (క్యూరియా సంస్కరణ): “రోమన్ క్యూరియా” అంటే వాటికన్లోని ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం లాంటిది. ఇందులో చాలా పాతకాలపు ఆఫీసులు, పద్ధతులు ఉండేవి. పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలనుకున్నారు. “ప్రెడికేట్ ఎవెంజెలియం” (సువార్తను ప్రకటించండి) అనే పేరుతో ఒక కొత్త నియమావళిని తెచ్చారు. దీని ద్వారా, పాత ఆఫీసులను కొన్నింటిని కలిపి, కొత్త వాటిని (వీటిని ‘డికాస్టరీలు’ అంటారు, అంటే మన ప్రభుత్వంలోని శాఖలు/విభాగాలు లాంటివి) ఏర్పాటు చేశారు. చర్చి ముఖ్య పని అయిన దేవుని సందేశాన్ని ప్రజలకు చేరవేయడం (సువార్త ప్రచారం) అన్నిటికన్నా ముఖ్యమని చెప్పారు. ఇంకో పెద్ద మార్పు ఏంటంటే, మొదటిసారిగా, వాటికన్లోని కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు బాధ్యులుగా మామూలు వ్యక్తులను (మత గురువులు కానివారిని, మహిళలను కూడా) నియమించే అవకాశం కల్పించారు. ఇది చాలా పెద్ద మార్పు
చిన్నారుల లైంగిక వేధింపుల సమస్యపై కఠిన వైఖరి
చర్చికి చెడ్డపేరు తెచ్చిన పెద్ద సమస్యల్లో ఇది ఒకటి. కొంతమంది మత గురువులు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కొందరు అధికారులు దాన్ని కప్పిపుచ్చడం జరిగాయి. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. ఇలాంటి నేరాలను అస్సలు సహించకూడదని (Zero Tolerance) స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు (బిషప్లు లాంటివారు) ఇలాంటి కేసులను దాచిపెడితే, వారిపై చర్యలు తీసుకోవడానికి “వోస్ ఎస్టిస్ లక్స్ ముండీ” (మీరు లోకానికి వెలుగు) అనే కొత్త చట్టం తెచ్చారు. అంటే, వాళ్ళు కూడా బాధ్యులవుతారని చెప్పారు. బాధితుల మాట వినడానికి, పిల్లల రక్షణకు సలహాలు ఇవ్వడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు.అయినా, ఈ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, బాధితులకు ఇంకా న్యాయం జరగాలని కొందరు అంటున్నారు.
అందరి మాటకు ప్రాధ్యానత: పోప్ ఫ్రాన్సిస్ పదేపదే చెప్పే మాట “సైనడాలిటీ”. దీని అర్థం, చర్చికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు, కేవలం పెద్ద అధికారులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లు, మత గురువులు, మామూలు విశ్వాసులు – అందరి అభిప్రాయాలు తీసుకోవడం, అందరూ కలిసి చర్చించుకోవడం. ఇ
దయ చూపడం అయన నైజం
చట్టాలు, నియమాల కంటే దయ, కరుణ ముఖ్యమని పోప్ ఫ్రాన్సిస్ నమ్ముతారు. విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళు కొన్నిసార్లు చర్చి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి పట్ల కొంచెం సానుభూతి చూపాలని, వారిని పూర్తిగా దూరం పెట్టకూడదని “అమోరిస్ లెటీషియా” (ప్రేమ యొక్క ఆనందం) అనే లేఖలో సూచించారు. పేదలు, వలస వచ్చిన వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు లాంటి బలహీన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చర్చి వారికి అండగా నిలవాలని చెబుతారు.
Read Also: మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత