అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే వలసదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వారిని అత్యంత దారుణంగా వెనక్కి పంపిస్తోంది. తాజాగా పదుల సంఖ్యలో బ్రెజిల్ వలసదారులను వెనక్కి పంపింది. కనీసం నీళ్లు ఇవ్వకుండా, విమానంలో ఏసీ లేకుండా, చేతికి బేడీలు వేసి అత్యంత అవమానకరంగా పంపడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ పౌరులను అమెరికా వెనక్కి పంపిన తీరుపై బ్రెజిల్ తీవ్రంగా మండిపడింది. ఇది మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. మానవహక్కులను దారుణంగా అవమానించారని, తమ పౌరులను అవమానకర పరిస్థితుల్లో వెనక్కి పంపారని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు విమానం దిగిన వెంటనే వారి చేతులకున్న బేడీలను తొలగించామని న్యాయశాఖమంత్రి రికార్డో లేవాండోవ్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

విమాన ప్రయాణంలో తమకు ఎదురైన దారుణ అనుభవాలను బాధితులు వర్ణించారు. అమెరికాలో తనను ఏడు నెలలు నిర్బంధంలో ఉంచారని కంప్యూటర్ టెక్నీషియన్ ఎడ్గార్ డా సిల్వామౌరా తెలిపారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం దారుణంగా ఉందని చెప్పారు. కాగా, బాధితులను తరలిస్తున్న విమానం బ్రెజిల్లోని ఉత్తర నగరమైన మనౌస్లో ల్యాండ్ అయింది. అందులో ప్రయాణించిన 88 మంది బ్రెజిల్ పౌరులు చేతులకు బంధనాలతో దిగడంతో అందరూ నిర్ఘాంతపోయారు. వెంటనే వారికి వేసిన బేడీలను తొలగించి వారి గమ్యస్థానాలకు గౌరవంగా తరలించాలని అధ్యక్షుడు లులూ వైమానిక దళాన్ని ఆదేశించారు.
అక్రమ వలసలను అరికట్టేందుకు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ట్రంప్ కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ‘దక్షిణ సరిహద్దు వద్ద జాతీయ అత్యవసర స్థితి’ని ప్రకటించి సైన్యాన్ని నియమించారు.