గాజా(Gaza)లో కొత్త సహాయ వ్యవస్థ మానవతా సాయాన్ని అందించే పని ప్రారంభించింది. హమాస్(Hamas)పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్(Israel) దాదాపు 3 నెలల పాటు మానవతా సాయాన్ని నిలిపివేయగా తాజాగా ఆహార పంపిణీ ప్రారంభమైనట్టు అమెరికా(America) మద్దతున్న నూతన వ్యవస్థ తెలిపింది. ఐక్యరాజ్యసమితి(UNO) అభ్యంతరం వ్యక్తంచేస్తున్నప్పటికీ సహాయ చర్యలను చేపట్టినట్టు పేర్కొంది.

గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అధిపతి రాజీనామా
గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించిన రోజునే అత్యవసర సామగ్రి సరఫరా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మంగళవారం మరిన్ని ట్రక్కులతో ఆహార సామగ్రి పంపిణీ చేస్తామని ఒక ప్రకటనలో అమెరికా మద్ధతున్న నూతన వ్యవస్థ తెలిపింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న కొత్త వ్యవస్థను ఐక్యరాజ్యసమితి, ఇతర సహాయ బృందాలు వ్యతిరేకించాయి. ఆహారాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా వినియోగించుకుంటుందని ఆరోపించాయి. ఆహారాన్ని హమాస్ దారిమళ్లించకుండా ఉండేందుకే కొత్త వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో ఏర్పడిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అధిపతి జేక్ వుడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ సాయాన్ని ప్రారంభించింది. అయితే, స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు లేని పరిస్థితులు ఉండటం వల్లే తన పదవి నుంచి తప్పుకొంటున్నట్లు జేక్ వుడ్ ప్రకటించారు.
అమెరికా విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం!
మరోవైపు అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ, 10 మంది బందీల విడుదల, మృతి చెందిన కొందరు బందీల మృతదేహాల అప్పగింత కూడా ఉన్నట్లు అల్ జజీరా ఛానల్ పేర్కొంది. ఇందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను రెండు దశల్లోగా ఇజ్రాయెల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఐదుగురు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయగా, 60వ రోజు మిగతా ఐదుగురిని హమాస్ విడిచిపెట్టనుంది. అయితే, ఎలాంటి ఒప్పందానికి హమాస్ అంగీకరించలేదని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.
వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనియన్లు మృతి
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని స్థానిక వైద్యాధికారులు పేర్కొన్నారు. మృతుల్లో జబాలియాలో ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 36మంది ఉన్నారు. వారిలో 18మంది చిన్నారులు కూడా ఉన్నారు. నిద్రలోనే వీరంతా చనిపోయారని స్థానికులు పేర్కొన్నారు. మొత్తం మూడు సార్లు ఈ పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించిందని తెలిపారు. జబాలియాలో చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Gaza: ఇజ్రాయెల్ దాడిలో పిల్లలను కోల్పోయిన ఓ వైద్యుడి దీన గాథ..