తూర్పు ఇండోనేషియా(Indonesia)లోని నుసా టెంగారా ప్రావిన్స్లో లెవోటోబి లకి-లకి (Lali-Lali)అగ్నిపర్వతం బద్దలవడం వల్ల, దానికి సమీపంలో బాలి(Bali)కి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమై దిల్లీకి చేరుకుంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత భారత్, సింగపుర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు చెప్పారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలోపెట్టుకుని అలా చేసినట్లు వెల్లడించారు.

దాదాపు 11కిలోమీటర్ల ఎత్తులో బూడిద
ఈ ఏడాది మేలోనే తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని లెవోటోబి లకి-లకి పర్వతం పలుమార్లు బద్దలయ్యింది. మంగళవారం ఈ అగ్నిపర్వం విస్ఫోటనం చెందడం వల్ల దాదాపు 11కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం మళ్లీ ఈ అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఒక కిలోమీటర ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడినట్లు అధికారులు చెప్పారు. దీంతో అగ్నిపర్వతం సమీప గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ పేర్కొన్నారు.
పలు సర్వీసులు రద్దు
వివిధ కారణాలతో మంగళవారం ఒక్కరోజే ఎయిరిండియాకు చెందిన ఏడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ, విమానాలు అందుబాటులో లేవంటూ ఆయా సర్వీసులను రద్దు చేశారు. అయితే రద్దయిన ఈ విమాన సర్వీసుల్లో ఆరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లే. జూన్ 12న అహ్మదాబాద్(Ahmedabad) ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాల్లో పూర్తిస్థాయి భద్రతా తనిఖీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)(DGCA) ఆదేశాలు జారీ చేసింది. ఆ తనిఖీల్లో భద్రతాపరమైన సమస్యలేవీ బయటపడలేదని డీజీసీఏ క్లీన్ చిట్ ఇచ్చింది.
Read Also: Fordo Nuclear Plant: ఇరాన్లో ఫోర్డో అణు కేంద్రంపై ఏరియల్ దాడి