విధి ఎంత క్రూరమో, ఎంత అనిశ్చితమో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఎంతో ఉత్సాహంగా, ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరిన ఒక యువ ఇంజనీర్ తొలి రోజే ప్రాణాలు కోల్పోయాడు. తన కుటుంబానికి భరోసాగా నిలుస్తానని అనుకున్న ఆ యువకుడు, అదే ఉద్యోగం మొదటి రోజే ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది.

మెదక్ జిల్లాకు చెందిన నవీన్ చారి అనే యువ ఇంజనీర్ ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు ఇదే గొప్ప అవకాశం అని భావించిన అతడు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉద్యోగం మొదలుపెట్టాడు. కానీ విధి వేరేలా ఆలోచించింది.
ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ.. మృత్యువాత!
తొలిరోజు ఉద్యోగానికి వెళ్లిన నవీన్ చారి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నార్సింగ్లోని కోకాపేట్ టీ గ్రీల్ సమీపంలో అతను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే అతడు అక్కడికక్కడే తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు తక్షణమే స్పందించి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడి గాయాలు మరీ తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ నవీన్ చారి కన్నుమూశాడు. కొడుకు ఉద్యోగం సంపాదించాడని ఎంతో ఆనందపడ్డ తల్లిదండ్రులు ఒక్కసారిగా అతడిని కోల్పోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కరోజు కూడా పూర్తిగా ఆఫీస్ చేయకముందే ఇలా జరగడం కుటుంబసభ్యుల హృదయాలను ముక్కలుగా మార్చింది. తన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవీన్ చారి స్నేహితులు, బంధువులు కూడా ఈ ఘటన గురించి విని కంటతడి పెట్టుకుంటున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ఢీకొట్టిన వాహనం ఏది? డ్రైవర్ ఎవరు? అనే వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వాహనాన్ని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి రోడ్ యాక్సిడెంట్స్ తరచుగా జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్లో రోజుకు అనేకమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రోడ్లపై జాగ్రత్తలు పాటించకపోవడం ఇలాంటి విషాద ఘటనలకు కారణమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలి. నవీన్ చారి మృతి కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. కలలు కనాల్సిన వయస్సులో తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం అందర్నీ కలచివేస్తోంది. ఈ ఘటన మరింతమందికి అవగాహన కలిగించి, రోడ్డు ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకునేలా ఉండాలి.