హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, యూనివర్సిటీ భూసంపదను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
విద్యార్థులు ఆందోళన
కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా అభివృద్ధి చేసి, ఐటీ సంస్థలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండటంతో, ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూనివర్సిటీకి భూముల కేటాయింపు
1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటగా, అబిడ్స్లో గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించగా, ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు.2003లో, రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే, నిర్దేశిత సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించకపోవడంతో, 2006లో ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేసింది.

డ్రోన్ చిత్రాలు
ఇప్పటికే జేసీబీలు పెద్దసంఖ్యలో అక్కడ పనులు చేస్తున్నాయి.అప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లు, పొదలను తొలగించి చదును చేసే పనులు చకచకా కొనసాగుతున్నాయి. రాత్రిళ్లు కూడా పనులు కొనసాగుతున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు.”ఇప్పటికే సగం అడవిని చదును చేసేశారు. రాత్రిళ్లు కూడా పనులు చేస్తుండటంతో నెమళ్లు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. మా విద్యార్థులందరికీ చాలా బాధగా అనిపిస్తోంది.” అని అంబేడ్కర్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వెన్నెల చెప్పారు.ప్రస్తుతం వివాదం నడుస్తున్న ప్రాంతానికి సంబంధించి స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేశారు. అందులో పెద్దసంఖ్యలో పొక్లెయిన్లు పనులు చేస్తున్నట్లుగా ఉంది.అందులో ఒక చెరువు కూడా కనిపిస్తోంది.”చదును చేస్తున్న ప్రాంతంలోనే పీకాక్ లేక్ ఉంది.
రక్షించే బాధ్యత
తాము పనులు చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవని చెబుతోంది టీజీఐఐసీ.”అయితే, మష్రూం రాక్స్తో పాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్) ఈ భూముల్లోనే ఉన్నట్లుగా గుర్తించాం. వాటిని హరిత స్థలాలుగా (గ్రీన్ స్పేస్) పరిరక్షిస్తాం.” అని టీజీఐఐసీ చెబుతోంది.”మేం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా ముట్టుకోలేదు. నేను అదే యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అక్కడే చదువుకున్నారు. యూనివర్సిటీ భూములను రక్షించే బాధ్యత మాపై ఉంది.” అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెప్పారు.”25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆ భూమి లేదు. డెవలప్మెంట్ కోసం భూమిని టీజీఐఐసీకి కేటాయించి ఐటీ కంపెనీలు రావాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక రూపొందించాం.” అని చెప్పారు.