India Pakistan War: పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ

Read Time:  1 min
పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ
పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ
FONT SIZE
GET APP

భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వచ్చే 24- 36 గంటల్లో భారత్ తమపై యుద్ధానికి దిగొచ్చంటూ స్వయంగా ఆ దేశ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అతావుల్లా తరార్ చేసిన ప్రకటన తరువాత రెడ్ అలర్ట్ ప్రకటించింది. దేశ గగనతలంపై నిఘా తీవ్రతరం చేసింది. అన్ని విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలంటూ ఎయిర్ సేఫ్టీని జారీ చేసిందక్కడి ప్రభుత్వం. గిల్గిట్, స్కర్దులకు ఏకంగా విమానాల సర్వీసులను సైతం రద్దు చేసింది.

 పాక్ విమానాశ్రయాలకూ హైఅలర్ట్ జారీ

విదేశీ విమానాలపైనా నిఘా
ఈ చర్యలు తాత్కాలికమేనని, గిల్గిట్, స్కర్దు రీజియన్లల్లో భద్రతా పరిస్థితులను పునః సమీక్షించిన అనంతరం విమాన సర్వీసులను పునరుద్దరిస్తామని పాకిస్తాన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఆదేశాలను జారీ చేసినట్లు వివరించారు. తమ గగనతలం గుండా ప్రయాణించే అన్ని విదేశీ విమానాలపైనా నిఘాను ఉంచింది పాకిస్తాన్. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని, అసాధారణ వైమానిక కార్యకలాపాలు ఏవైనా సంభవిస్తే తక్షణమే తిప్పికొట్టడానికి వీలుగా ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు పాక్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం- ఏవైనా అనుమానాస్పద విమానాలు తమ దేశ గగనతలం గుండా రాకపోకలు సాగించడానికి ముందస్తు అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయి క్లియరెన్స్ అవసరమౌతుంది. తాజాగా జారీ చేసిన ప్రొటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అన్ని విమాన సర్వీసులను అధికారులు ఆదేశించారు.
భారత్‌ తమపై యుద్ధానికి దిగే అవకాశాలు
పాకిస్తాన్ మంత్రి అతావుల్లా తరార్ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించిన విషయం తెలిసిందే. వచ్చే 24-36 గంటల వ్యవధిలో ఏ క్షణమైనా భారత్‌ తమపై యుద్ధానికి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ మేరకు అత్యంత విశ్వసనీయ సమాచారం తమకు అందిందని తెలిపారు. పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనను అడ్డుగా పెట్టుకుని భారత్ తమపై యుద్ధానికి దిగుతోందని, నిజానికి ఆ ఉగ్రవాద దాడితో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని అతావుల్లా తెలిపారు. ఈ విషయంలో భారత్ చేస్తోన్న ప్రకటలన్నీ కూడా నిరాధారమైనవని అన్నారు.

Read Also: Pahalgam Terror Attack: శౌర్యచక్ర అవార్డు గ్రహీత తల్లి పాకిస్తాన్ కు వెళ్తున్న వార్తల్లో నిజం లేదు

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.