కరోనా వైరస్ మరోసారి ఆసియాలోని పలు దేశాల్లో పంజా విసురుతోంది.సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలోనూ కేసుల సంఖ్య మళ్ళీ స్వల్పంగా పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు JN.1 వేరియంట్, దాని సంబంధిత ఉప-రకాలు కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2.86 కుటుంబానికి చెందినదని అంటున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డ్(Covid ward) వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ భయంతో అనవసరంగా ఆందోళనకు గురి కావొద్దని గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఓపీ భవనం రెండో అంతస్తులో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు.
అవసరం
కాగా, JN.1 వేరియంట్ లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట వంటివి ప్రధాన లక్షణాలు. చాలా కేసుల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ , ICMR ఫ్రేమ్ల ద్వారా నిఘా కొనసాగుతోంది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం కూడా కేసుల పెరుగుదలకు ఒక కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి వృద్ధులు, గర్భిణీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, అవసరమైతే కోవిడ్-19 టీకా తీసుకోవడం వంటివి పాటించాలని అంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read Also: Revanth Reddy: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కోర్ట్ కు హాజరైన సీఎం రేవంత్