భారత్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి భయపెడుతోంది. సింగ్పూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇక, భారత్లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో కొత్త వేరియంట్ బయటపడింది. ఎన్బీ.1.8.1 అనే కొవిడ్-19 వేరియంట్ను గుర్తించారు. దీనితో పాటు ఎల్ఎఫ్.7 రకానికి చెందిన కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ రెండు వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పర్యవేక్షణ ఉంచింది. జేన్.1 వేరియంట్ కేసులు దేశంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ కేసు(Covid Case)లు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.భారత్లో ఎన్బీ.1.8.1 అనే కొత్త రకం కరోనా వైరస్ను గుర్తించినట్లు ఇన్సాకాగ్ తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. దీంతో పాటు ఎల్ఎఫ్.7 రకానికి చెందిన నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్వో ఈ రెండు ఉపరకాలను ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు’గా వర్గీకరించింది. అయితే, వీటిని ఆందోళనకర వేరియంట్లుగా ప్రకటించలేదు. కానీ, ఈ వేరియంట్ల వల్ల చైనా, హాంకాంగ్, సింగ్పూర్ వంటి ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
డబ్ల్యూహెచ్వో
ఎన్బీ.1.8.1 వేరియంట్ గత నెలలో తమిళనాడులో మొదటిసారిగా వెలుగు చూసింది. ఎల్ఎఫ్.7 కేసులు ఈ నెలలో గుజరాత్లో నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్లో జేన్.1 రకం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ రోగుల నుంచి సేకరించిన పరీక్షించిన నమూనాల్లో 53 శాతం కేసులు ఈ వేరియంట్కు చెందినవే ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీఏ.2 (26 శాతం), ఒమిక్రాన్కు సంబంధించిన ఇతర ఉపరకాలు (20 శాతం) ఉన్నాయి.ఎన్బీ.1.8.1 వల్ల ప్రజలకు ముప్పు తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్వో(WHO) ప్రాథమికంగా విశ్లేషించింది. అయితే, ఈ వైరస్లోని స్పైక్ ప్రొటీన్లో కొన్ని మార్పుల వల్ల ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా ఏమార్చి వ్యాప్తికి కారణమవుతుంది. ఈ మార్పుల్లో ఏ435ఎస్, వీ445హెచ్, టీ4781 ముఖ్యమైనవి.
సమావేశం
మే 19 నాటికి దేశంలో 257 కొవిడ్ కేసులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 23, ఆంధ్రప్రదేశ్లో నాలుగు, తెలంగాణలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 9 నెలల చిన్నారికి కూడా కరోనా వైరస్ సోకింది. గత 20 రోజుల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మే నెలలో కేరళలో 273 కేసులు నమోదయ్యాయి.దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన నిపుణులు పాల్గొన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Karun Nair: కరుణ్ నాయర్ ఎంపిక చాలా మంచి నిర్ణయం: సునీల్ గవాస్కర్