అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే భవిష్యత్ అంతా వైసీపీదేనంటున్నారు. ఏపీలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి మిత్ర పక్షాల నుంచి ముప్పు పొంచి ఉందని బీజేపీ, జనసేనను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అనంత వెంకటరామిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై గ్రామ స్థాయి నుంచి పోరాటం చేద్దామని కేడర్కు సూచించారు. నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని వెల్లడించారు.

త్వరలో జిల్లా వైసీపీ కార్యాలయం ప్రారంభమిస్తారమన్నారు వెంకటరామిరెడ్డి. అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అందుబాటులోకి రావాలని సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా కమిటీలోని నాయకులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని హితవుపలికారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మన పార్టీ ఆఫీస్ గుర్తుకు రావాలని దిశానిర్దేశం చశారు. అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్న భరోసా కల్పించాలన్నారు. కేడర్ కూడా మరింత యాక్టివ్గా ఉండాలని వెంకటరామిరెడ్డి సూచించారు. పార్టీ ఒక్క పిలుపు ఇస్తే గ్రామ స్థాయి నుంచి క్యాడర్ అంతా కదలాలని ఉత్సాహం నింపారు. వైసీపీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులందరిపై కూడా ఉందని సూచించారు. జమిలి వస్తాయో లేదో తెలియదు కానీ అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని అందరూ సమాయత్తం కావాల తెలిపారు.
కార్యకర్తల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు ఇకపై జరగబోవని హామీ ఇచ్చారు వెంకటరామిరెడ్డి. తప్పకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. ఈ సమావేశంలోనే వైసీపీ బలోపేతంపై నియోజకవర్గాల సమన్వయకర్తలు సూచనలు, సలహాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దామని, అందరూ ఐకమత్యంతో కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.