సౌదీ ఆరేబియా: సౌదీ ఆరేబియా లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది భారత పౌరులు దుర్మరణం పాలయ్యారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. జెడ్డా లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, స్థానిక అధికారులతో బాధిత కుటుంబాలతో తాము ఘటనపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
ప్రమాదంపై బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోవడం కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 8002440003 (Toll free), 0122614093, 0126614276, 0556122301 (WhatsApp) నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. కాగా ప్రమాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
జెడ్డాలోని రాయబార కార్యాలయంతో తాను మాట్లాడానని, ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నానని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతోందని అన్నారు. ఈ విషాద పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.