ఓ కుటుంబ వేడుకలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. కానీ ప్రేమలో మొదలైన అనుమానం చివరకు ఓ యువతి ప్రాణం తీసేలా చేసింది. అందంగా కనిపించకూడదనే ఉద్దేశంతో తన జుట్టును కూడా త్యాగం చేసింది. అయినా భర్త తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని ముగించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కూశ్వాహ (18) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రెండు సంవత్సరాల క్రితం తన సొంత ఊరిలో జరిగిన కుటుంబ శుభకార్యానికి హాజరైంది. ఆ వేడుకలో తన దూరపు బంధువైన రింకూ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా గాఢమైన ప్రేమలోకి మారింది. ఇద్దరూ తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ప్రేమను కొనసాగించారు. అంతేకాకుండా, కుటుంబ పెద్దల అంగీకారం లేకపోయినా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఇంట్లోనే అలాగే ఉండిపోతూ గడిపారు. రింకూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ప్రీతిని రహస్యంగా కలుస్తూ వచ్చేవాడు.
అనుమానం మొదలైన తరుణం
రహస్యంగా కలుసుకుంటూ, కాల్స్, ఫోన్ ఛాట్స్ ద్వారా రోజూ మాట్లాడుకునే ప్రీతిని రింకూ తక్కువ మాటలు మాట్లాడటం ప్రారంభించాడు. కొన్ని రోజులకు అనుమానించడం మొదలు పెట్టాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ప్రీతి ఎంతగా విశ్వసించబోయినా రింకూ ఆమెను తీవ్రంగా అనుమానించసాగాడు. రోజూ ఫోన్ కాల్స్, చాట్స్ తన ముందే చేయాలని, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడొద్దని పట్టుబట్టడం ప్రారంభించాడు. ప్రీతి తన భర్త అనుమానాన్ని తొలగించడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. అతనికి సంతృప్తిని ఇచ్చేందుకు ఏదైనా చేయాలనుకుంది. తన అందం కారణంగా రింకూ ఈ అనుమానాలు పెంచుకుంటున్నాడని భావించి, అందంగా కనిపించకూడదనే గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులు ఎంతగా వారించినా వినకుండా సెలూన్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రీతి సోదరుడు ఆమెను నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రీతి వినలేదు. చివరకు తన సోదరుడే ఆమెకు గుండు చేశాడు. ఈ sacrifice చేసిన రింకూ మారుతాడని ప్రీతి ఆశించింది. కానీ రింకూ మారలేదు.
తీవ్ర మనస్తాపం.. ఊహించని ముగింపు
ప్రీతి ఈ పరిస్థితిని తట్టుకోలేక పోయింది. ఒకపక్క తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్న బాధ, మరోపక్క భర్త తనను పట్టించుకోవడం మానేసిన ఆవేదన తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. ప్రీతి మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తాము ఎంతగా చెప్పినా వినకుండా, ప్రేమ పేరుతో చేసిన నిర్ణయం చివరకు ప్రాణాన్ని తీసుకుపోయిందని బాధపడ్డారు. ప్రీతి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.