హైదరాబాద్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రేపు (మంగళవారం)జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు.

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10 తో ముగియనుంది. ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో 58 జనరల్ సీట్లు కాగా.. మరో 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు. మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లలో 83.49 లక్షల మంది పురుష ఓటర్లు కాగా.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో 20 నుంచి 29 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలుగా ఉంది. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల తొలిసారి ఓటేసే వారి సంఖ్య 2.08 లక్షలు.
ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక అవసరాలు ఉన్న (PWD) వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. పీడబ్ల్యూడీ వర్గం నుంచి 79,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 100 సంవత్సరాలు దాటిన ఓటర్ల సంఖ్య 830 గా ఉంది. 85 ఏళ్ల వయస్సు దాటిన ఓటర్లు 1.09 లక్షల మంది ఉన్నారు. ఢిల్లీలో ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య 1,261 గా ఉంది.