శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ భారత వాయుసేన(Indian Airforce)ను ఆధునికీకరించే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా దేశీయంగా అధునాతన ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్(Defence Minister Rajnathsingh) పచ్చజెండా ఊపారు. స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఈ ఫైటర్జెట్(fighter jet) కలిగి ఉంటుంది.

ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు నమూనాకు రాజ్నాథ్ ఆమోదం
భారత వాయుసేన కోసం అభివృద్ధి చేయనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు నమూనాకు రాజ్నాథ్ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత వాయుసేన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం సహా దేశీయ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టనుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా ఎగ్జిక్యూషన్ మోడల్ రూపొందించారు. బిడ్లు స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్గా లేదా కన్సోర్షియంగా వేసే అవకాశముంటుంది.
వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా నిలవనుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఐదో తరానికి చెందిన యుద్ధ విమానం. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా వేశారు. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. భారత వాయుసేన దీర్ఘకాల అవసరాల్లో భాగంగా ఈ AMCA ప్రాజెక్టును చేపట్టారు.
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారిగా ‘ఏరో ఇండియా-2025’ కార్యక్రమంలో భారత్ ప్రపంచానికి చూపించింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్ను రూపొందించింది. హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. విదేశీ స్టెల్త్ ఫైటర్లకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిష్కారం. రక్షణ రంగ ఆత్మనిర్భరతను బలోపేతం చేయడం, తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన యుద్ధ వాహనాన్ని అభివృద్ధి చేయడం,భారత్ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టడం, విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక యుద్ధ విమానం అభివృద్ధి.
Read Also: US Visa: క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు: ట్రంప్