వివాహ బంధానికి విలువ రోజురోజుకూ పడిపోతోందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. చిన్న చిన్న కారణాలకే హత్యలు, దారుణాలు చేసుకునే స్థాయికి సంబంధాలు దిగజారిపోవడం సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా బిహార్ (Bihar) లో జరిగిన ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కేవలం 45 రోజులకే ఓ నవ వధువు.. తన ప్రియుడైన మేనమామతో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన వివాహ వ్యవస్థపై పెరుగుతున్న అగౌరవం, అనైతిక సంబంధాల తీవ్రతను మరోసారి కళ్ళకు కట్టింది.
ఘటన వివరాలు
Bihar: ఔరంగాబాద్ జిల్లాలోని బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాన్షుకు (Priyanshu) రెండు నెలల క్రితం గుంజా దేవితో (Gunja Devi) వివాహమైంది. అయితే, గుంజా దేవికి తన మేనమామ అయిన జీవన్ సింగ్ (55)తో పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా, వారి కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. దీంతో గుంజా దేవి కుటుంబం ఆమె ఇష్టానికి విరుద్ధంగా (against will) ప్రియాన్షుతో బలవంతంగా పెళ్లి జరిపించింది. భర్తతో కాపురం ఇష్టం లేని గుంజా దేవి, అతడిని తమ దారి నుంచి తొలగించుకోవాలని తన మేనమామ జీవన్ సింగ్తో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో జూన్ 25న ప్రియాన్షు తన సోదరి ఇంటికి వెళ్లి రైలులో తిరిగి వస్తున్నాడు. నవీ నగర్ స్టేషన్లో దిగిన తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లేందుకు బైక్పై ఎవరినైనా పంపమని భార్య గుంజా దేవికి ఫోన్ చేసి చెప్పాడు. ప్రియాన్షు స్టేషన్ నుంచి ఇంటికి బైక్పై వస్తుండగా, మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి కాల్చి చంపారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తు, అనుమానాలు
భర్త చనిపోయిన తర్వాత గుంజా దేవి ప్రవర్తనపై ప్రియాన్షు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారి అనుమానం మరింత బలపడింది. పోలీసులు గుంజా దేవి కాల్ రికార్డులను పరిశీలించగా, ఆమె తన మేనమామ జీవన్ సింగ్తో నిరంతరం ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత జీవన్ సింగ్ కాల్ డేటాను విశ్లేషించగా, అతను షూటర్లతో సంప్రదింపులు జరిపినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ హత్య కేసును ఛేదించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని ఎస్పీ అమ్రిష్ రాహుల్ మీడియాకు తెలిపారు. “ప్రియాన్షు, గుంజా దేవిల పెళ్లి జరిగిన 45 రోజులకే ఈ హత్య జరిగింది. ఈ కేసులో గుంజా దేవితో పాటు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న ఆమె మేనమామ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నాం” అని ఎస్పీ వెల్లడించారు. ఇటీవల మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనను ఈ కేసు గుర్తు చేస్తోంది. ఇలాంటి ఘటనలు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయి.
Read also: Kolkata Rape case: కోల్కతా లా విద్యార్థిని కేసులో.. నిందితుడు న్యాయవాద లైసెన్సును రద్దు