బెట్టింగ్ ప్రమోషన్లపై ఉక్కుపాదం
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. గత ఒక సంవత్సరంలో బెట్టింగ్ కారణంగా 15 మంది యువత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సినీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 108 అక్రమ వెబ్సైట్లు బ్లాక్ చేయగా, మరో 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్స్కు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహకులపై ఉక్కుపాదం మోపుతూ వారికి మద్దతుగా ఉన్న వారిపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రభుత్వం చట్టపరమైన సలహా తీసుకుంటూ, టెక్నాలజీ సహాయంతో బెట్టింగ్ యాప్స్ను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ – పోలీసుల దూకుడు
తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ నిర్వహణను పూర్తిగా అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతోంది. అక్రమంగా పనిచేస్తున్న బెట్టింగ్ వెబ్సైట్లను టెలికం టెక్నాలజీ ద్వారా నిరోధిస్తోంది. ప్రత్యేకంగా, TGCSB జియో-ఫెన్సింగ్ టెక్నాలజీని అమలు చేస్తోంది, తద్వారా రాష్ట్రంలో ఈ వెబ్సైట్లు యాక్సెస్ కాకుండా నియంత్రణ విధిస్తున్నారు. ఇప్పటికే 108 వెబ్సైట్లను బ్లాక్ చేసి, మరో 133 ప్లాట్ఫామ్స్కు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆర్థికంగా నష్టపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిర్బంధాలు, విచారణలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సెలబ్రిటీల ప్రమోషన్లపై దర్యాప్తు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు సినీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి తమ ప్రమోషన్ స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే సంబంధించింది అని తెలిపినప్పటికీ, పోలీసులు వారికి డబ్బు ఎలా వచ్చినదీ పరిశీలిస్తున్నారు. ఇంకా యూట్యూబర్లు, టిక్టాక్ స్టార్లు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లు ఎంత వరకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారనే దానిపై అధికారులు స్పష్టత పొందాలని చూస్తున్నారు. మరికొందరు విచారణకు హాజరుకావాల్సి ఉంది.
బెట్టింగ్ కారణంగా ఆత్మహత్యలు – బాధిత కుటుంబాల గోస
ఇప్పటికే బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న బాధితుల కుటుంబాలను పోలీసులు సంప్రదిస్తున్నారు. ఈ ఆత్మహత్యలు ఎక్కువగా విద్యార్థులు, యువతీ యువకులు చేయడం గమనార్హం. పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోయిన తర్వాత మానసిక ఒత్తిడికి గురై వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
విచారణ భయంతో పరారీలో ఉన్న ఇన్ఫ్లూయెన్సర్లు
ఈ కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి, తేస్టీ తేజ, కిరణ్ గౌడ్లను విచారించారు. కానీ శ్యామల, అజయ్ సన్నీ, సుప్రీత, సన్నీ సుధీర్ల ఫోన్లు స్విచాఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల పక్కా ప్రణాళిక – మరిన్ని అరెస్టులు ఉండొచ్చు
బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను టార్గెట్ చేస్తూ పోలీసులు ముందుకెళ్తున్నారు. వారికి ఎవరు మద్దతుగా ఉన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి? అన్నదానిపై దర్యాప్తును విస్తరించారు. ప్రస్తుత దశలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చని తెలుస్తోంది.