Maheshwar Reddy : తెలంగాణ బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడారు. రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్ సర్కారు అప్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి.

నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్ అప్పులు
యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10 శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదు అని ఆయన అన్నారు. నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు.
ఆదాయం చరానా.. అప్పు బరానా
ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్ పెట్టారు అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.