CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ , బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు.

ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు.
కొన్నాళ్లు హైదరాబాద్లో నివాసం
రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సొంతిల్లు లేదు. విభజన తరువాత కొన్నాళ్లు హైదరాబాద్లో నివాసం ఉన్న చంద్రబాబు అనంతరం కరకట్ట ఒడ్డున అద్దెకు నివసిస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు దృష్టి సారించారు. 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలు కొంత చేపట్టగా ఇప్పుడు వాటిపై పూర్తి దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటిపై దృష్టి సారించారు.
Read Also: 11న ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు