ఆధార్ సేవల్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న యాప్ లో ఫీచర్లకు అదనంగా మరిన్ని జోడించింది. ఈ కొత్త ఆదార్ మొబైల్ యాప్ ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఈ యాప్ లో ఫీచర్లను వివరించారు.
స్కాన్ చేస్తే ఫేస్ ఐడీ ద్వారా ధృవీకరణ
ఈ కొత్త ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే హార్టీ వెల్ కమ్ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఆ తర్వాత కింద క్యూఆర్ కోడ్ స్కానర్ ను ఇచ్చారు. మన ముఖానికి ఎదురుగా ఫోన్ పెట్టుకుని దీన్ని స్కాన్ చేస్తే ఫేస్ ఐడీ ద్వారా ధృవీకరణ పూర్తి చేస్తుంది. ఆ తర్వాత యాప్ లో సేవల్ని వాడుకోవచ్చు. ఇది మన ఫోన్లో ఉంటే ఇక ఆధార్ కార్డును మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే జిరాక్స్ కాపీల్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ లో తెలిపారు.
వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణ
ఇప్పుడు కేవలం ఒక ట్యాప్తో, వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే పంచుకోగలరని అశ్వీనీ వైష్ణవ్ తెలిపారు. అలాగే వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను వారికే ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త యాప్ ఇంకా టెస్టింగ్ దశలో (బీటా) ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందులో ఆధార్ ధృవీకరణ UPI చెల్లింపు చేసినంత సులభంగా ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యతను నిర్ధారిస్తూ వారి ఆధార్ వివరాలను డిజిటల్గా ధృవీకరించవచ్చు మరియు పంచుకోవచ్చని తెలిపారు.

ఆధార్ యాప్ సురక్షితమైనది
కొత్త ఆధార్ యాప్ తో, వినియోగదారులు ఇకపై వారి ఆధార్ ను స్కాన్ చేయాల్సిన లేదా ఫోటోకాపీ చేయాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే హోటల్ రిసెప్షన్లలో, దుకాణాలలో లేదా ప్రయాణ సమయంలో ఆధార్ ఫోటోకాపీని అందజేయవలసిన అవసరం లేదన్నారు. ఆధార్ యాప్ సురక్షితమైనది వినియోగదారు సమ్మతితో మాత్రమే షేర్ చేయబడుతుందన్నారు.
కొత్త ఆధార్ యాప్ తో కచ్చితమైన గోప్యత ఉంటుందని, ఆధార్ డేటా దుర్వినియోగం లేదా లీక్లు ఇకపై ఉండవని కేంద్రమంత్రి తెలిపారు. ఫోర్జరీ లేదా ఎడిటింగ్ (మీ ఆధార్ను ఫోటోషాప్ చేయడం వంటివి!) నుండి రక్షణ కల్పిస్తుందన్నారు. త్వరలో దీన్ని పూర్తి స్దాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
READ ALSO: Rafale Fighter Jet: రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్తో ఒప్పందం