రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో ఆధునికతను అందిపుచ్చుకునేందుకు యువత ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి వారి కోసమే ఈవినింగ్ బీటెక్ కోర్సుల బోధనకు రంగం సిద్ధమైంది. ఇందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) వేదికగా నిలిచింది. ప్రధానంగా డిప్లొమా విద్యతో ప్రభుత్వ, ఇతర ప్రముఖ సంస్థల్లో ఇంజినీర్లుగా స్థిరపడిన వారికి ఇది స్వాగతం పలుకుతోంది. ఇంజినీర్లుగా ఉంటూ రోజువారీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులకు హాజరుకాని వారికి ఇదో మంచి సువర్ణావకాశం. విధులు ముగించుకొని తరగతులకు హాజరై బీటెక్ విద్యను అభ్యసించవచ్చు. ఆసక్తి కలిగిన ఉద్యోగులకు ఏప్రిల్ 15 వరకు ఈ ఏడాది ప్రవేశాలకు గడువుగా ఉంది.

ప్రతి కోర్సులో 30కి మాత్రమే ఛాన్స్
డిప్లొమా చదివి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు బీటెక్ విద్యను అభ్యసించడం కష్టం. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేయాలి. ఇలాంటి వారు ఉద్యోగోన్నతులు పొందాలన్నా, ఇతర కేటగిరీలోకి వెళ్లాలన్నా బీటెక్ విద్య తప్పనిసరి అవుతుంది. అందుకోసం బీటెక్లో మైనింగ్ ఇంజినీర్, ఈసీఈ, ఈఈఈ కోర్సుల్లో సాయంత్రం విద్య అందుబాటులో ఉంది. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని కేటీపీఎస్, సింగరేణి, ఎన్ఎండీసీ, ఐటీసీ, కలెక్టరేట్, నవభారత్, ఎన్పీడీసీఎల్, ఇతర సెక్టార్లలో డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న ఇంజినీర్స్ కోసం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు బోధన కొనసాగనుంది.