Headlines

నిజ్జర్ హత్య కేసు..మాటమార్చిన కెనడా ప్రధాని ట్రూడో

Canadian Prime Minister admits Canada had ‘intel, not hard proof’ against India in Nijjar killing

న్యూఢిల్లీ : గతేడాది జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ ఇన్నాళ్లు ఆరోపణలు గుప్పించిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మాట మార్చారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే గట్టి ఆధారాలు ఏవీ లేవని ఆయన అంగీకరించారు. భారత ప్రమేయంపై నిర్ణయాత్మక సాక్ష్యాలు పెద్దగా లేవన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే తాను ఈ ఆరోపణలు చేశానని ఆయన ఒప్పుకున్నారు. కెనడా ఫెడరల్ ఎన్నికల ప్రక్రియలు, ప్రజాస్వామ్య సంస్థలలో విదేశీ జోక్యంపై బహిరంగ విచారణలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కెనడా ఇంటెలిజెన్స్‌తో పాటు ‘ఫైవ్ ఐస్’ మిత్రదేశాల ఇంటెలిజెన్స్ కూడా నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని చాలా స్పష్టంగా, నమ్మదగిన విధంగా చెప్పాయి. కెనడా గడ్డపై కెనడియన్ పౌరుడి హత్యలో భారత ప్రమేయం ఉందని చెబుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఉమ్మడిగా ‘ఫైవ్ ఐస్ నెట్‌వర్క్’ నిఘా ఏర్పాటు చేసుకున్నాయి. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్‌పై ఇది దృష్టి పెడుతుంది. ఫైవ్ ఐస్ అందించిన సమాచారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సినంత ఆందోళనకరంగా ఉందని ట్రూడో చెబుతున్నారు.

ఇదిలావుంచితే 2023లో జరిగిన నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఏజెంట్లే నిజ్జర్‌ను హత్య చేశారని కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. నిజ్జర్ హత్య కేసు విచారణ జరుగుతున్న వేళ జస్టిన్ ట్రూడో చేసిన ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *