దక్షిణ భారతదేశ జ్యువెలరీ రంగ దిగ్గజం లలిత జ్యువెలరీ(Lalitha Jewellary) మార్ట్ ఐపీఓలోకి ప్రవేశించింది. ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా రూ.1,700 కోట్లు సేకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. చెన్నై(Chennia) కేంద్రంగా పనిచేస్తున్న ఈ దిగ్గజ కంపెనీ ప్రతిపాదిత IPO, డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం..ప్రెష్ IPO కింద రూ. 1,200 కోట్ల విలువైనషేర్లు..అధినేత ఎం. కిరణ్ కుమార్ జైన్ ద్వారా రూ. 500 కోట్ల విలువైన షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద జారీ చేయనున్నారు.

IPOలో ఉద్యోగుల కోసం కొన్ని షేర్లు రిజర్వ్
లలిత జ్యువెలరీ మార్ట్ రూ. 5 ముఖ విలువను షేర్ కలిగి ఉంది. అయితే IPOలో ఉద్యోగుల కోసం కొన్ని షేర్లు రిజర్వ్ చేశారు. కంపెనీ ఉద్యోగులకు ఇందులో తగ్గింపు కూడా లభిస్తుంది. ఐపీఓలొ కొత్త వాటాల అమ్మకం ద్వారా వచ్చిన రూ.1,014.50 కోట్లను దేశ వ్యాప్తంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ దాఖలు చేసిన పత్రాలు చెబుతున్నాయి. ఇక క్యాపిటల్ మార్కెట్లో నుండి వచ్చిన మొత్తంలో మిగిలిన కొంత భాగాన్ని కంపెనీ సాధారణ కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.
లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది
లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ కుమార్ 1985లో చెన్నైలోని టి నగర్ ప్రాంతంలో తన మొదటి స్టోర్ను ప్రారంభించారు. డిసెంబర్ 31, 2024 నాటికి 56 స్టోర్లకు దీనిని విస్తరించారు, వాటిలో 22 ఆంధ్రప్రదేశ్లో, 20 తమిళనాడులో, ఏడు కర్ణాటకలో, ఆరు తెలంగాణలో, ఒకటి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 31, 2024తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి మొదటి తొమ్మిది నెలల్లో లలిత జ్యువెలరీ మార్ట్ యొక్క ఏకీకృత నిర్వహణ ఆదాయం రూ.12,594.67 కోట్లుగా ఉంది. ఇక నికర లాభం రూ.262.33 కోట్లుగా ఉంది.
ఈ ఇష్యూకు ఆనంద్ రతి అడ్వైజర్స్, ఈక్విరస్ క్యాపిటల్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి. కంపెనీ షేర్లను బిఎస్ఇ, ఎన్ఎస్ఇలలో లిస్ట్ చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆఫర్ బుక్-బిల్డింగ్ ప్రక్రియ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. నికర ఆఫర్లో 50% కంటే ఎక్కువ అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు వాటాలు కేటాయించరు. అయితే నికర ఆఫర్లో కనీసం 15%, 35% వరుసగా సంస్థాగతేతర, రిటైల్ వ్యక్తిగత బిడ్డర్లకు కేటాయిస్తారు. లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరింది.